Podalakur: గంజాయి తాగితే క్షణాల్లో పట్టేసే డ్రగ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయ్
Podalakur: గంజాయి మత్తు పదార్థాలు సేవించిన వారిని తక్షణమే గుర్తించేందుకు లాలాజలం ఆధారిత సరికొత్త డ్రగ్ టెస్టింగ్ కిట్లను ప్రవేశపెట్టినట్లు ఎస్ఐ రాకేష్ తెలిపారు.
Podalakur: గంజాయి తాగితే క్షణాల్లో పట్టేసే డ్రగ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయ్
పొదలకూరు: సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకంపై పొదలకూరు పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇకపై డ్రగ్స్, గంజాయి సేవించిన వారిని తక్షణమే గుర్తించేందుకు సరికొత్త 'డ్రగ్ టెస్టింగ్ కిట్లను' అందుబాటులోకి తెచ్చినట్లు స్థానిక ఎస్ఐ శివ రాకేష్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
గతంలో కరోనా పరీక్షలు నిర్వహించి నిమిషాల్లో ఫలితాలు తెలుసుకున్నట్లే, ఈ సరికొత్త కిట్ల ద్వారా అనుమానితుల లాలాజలం లేదా ఇతర నమూనాల ఆధారంగా క్షణాల్లో ఫలితాన్ని తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు సేవించారా లేదా అనేది ఈ కిట్ ద్వారా స్పష్టంగా తెలిసిపోతుందని వివరించారు.
పొదలకూరు పరిధిలో పగలు, రాత్రి సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా ఉంటూ, అల్లరి సృష్టించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి ఒక్కరికీ ఈ కిట్ల ద్వారా రాండమ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
మత్తు మహమ్మారి విద్యార్థులకు పాకకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. స్థానిక డిగ్రీ మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థలను పోలీసులు ఆకస్మికంగా సందర్శిస్తారని, విద్యార్థుల ప్రవర్తన, వారి కదలికలపై కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, అనుమానం వస్తే విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
పరీక్షల్లో ఎవరికైనా డ్రగ్స్ లేదా గంజాయి వాడినట్లు తేలితే వారిపై కచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, వారిని ఆ వ్యసనం నుండి దూరం చేసి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ప్రభుత్వ లేదా ప్రైవేట్ డీ-అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని తెలిపారు. పొదలకూరు పరిసర ప్రాంతాలలో గంజాయి అమ్మకాలు సాగించినా, గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసినా లేదా ఎవరైనా వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, మత్తు రహిత సమాజ స్థాపనకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.




