Nellore: నెల్లూరు జిల్లా యాత్రికులకు ఘోర ప్రమాదం.. బీహార్లో ముగ్గురు మృతి!
Nellore: బీహార్లోని ఔరంగాబాద్ వద్ద నెల్లూరు జిల్లా యాత్రికుల బస్సు ప్రమాదం. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు.
Nellore: నెల్లూరు జిల్లా యాత్రికులకు ఘోర ప్రమాదం.. బీహార్లో ముగ్గురు మృతి!
Nellore: నెల్లూరు జిల్లా నుండి ఉత్తర భారత దేశ యాత్రకు బయల్దేరిన ప్రైవేట్ బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీ బస్సును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో సంగం కి చెందిన పసుపులేటి వెంకటేశ్వర్లు, చవడం హాజరత్తయ్య అనే ఇద్దరు మృతి చెందారు.మరో 15 మంది యాత్రికులు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.అలాగే ఆత్మకూరు పట్టణానికి చెందిన మరో మహిళ కూడా మృతి చెందినట్లుగా సమాచారం. నెల్లూరు జిల్లా నుండి ఈ నెల 1వ తేదీన ఉత్తర భారత దేశ పుణ్యక్షేత్రాల యాత్ర కోసం ప్రైవేట్ బస్సు బయల్దేరింది.
బస్సులో ఆత్మకూరు,సంగం, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన మొత్తం 43 మంది యాత్రికులు ఉన్నారు.యాత్రలో భాగంగా యాత్రికులు నిన్న గయా పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం వారణాసి (కాశీ)కి బయల్దేరగా, ఔరంగాబాద్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు వారణాసి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం జరగడంతో యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుల పూర్తి వివరాలు, గాయపడిన వారి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. యాత్రకు వెళ్లిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారంపై బంధువులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.




