Udayagiri: వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి.. పోలీసుల విజ్ఞప్తి
Udayagiri: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి సీఐ వెంకట్రావు సూచించారు.
Udayagiri: వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి.. పోలీసుల విజ్ఞప్తి
Udayagiri: వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు సూచించారు. సెలవుల సమయంలో పిల్లలు ఎక్కువగా బయట తిరగడం, చెరువులు, కాలువలు, నీటి గుంటల వద్ద ఆడుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటనలను గుర్తు చేస్తూ ఆయన మాట్లాడారు. మొన్న సైదాపురం ప్రాంతంలో జరిగిన ఘటన, నేడు సీతారామపురంలో జరిగిన విషాదం అందరికీ హెచ్చరికగా తీసుకోవాలని అన్నారు. ఈ రెండు సంఘటనల్లో కూడా చిన్నారులు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.
సెలవులు కావడంతో పిల్లలు చెరువుల్లో ఈత కొట్టేందుకు, నీటిలో ఆడుకోవడానికి వెళ్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి గుంటలు ప్రమాదకరంగా మారుతున్నాయని, లోతు తెలియక పిల్లలు దిగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
పిల్లలను ఒంటరిగా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వనరుల దగ్గరికి వెళ్లకుండా కఠినంగా చెప్పాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే స్థానికంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, గ్రామస్థులు కూడా అప్రమత్తంగా ఉండడం అవసరమని సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదాలకు దారితీస్తుందని, ఇటీవల జరిగిన ఘటనలు దానికి నిదర్శనమని సిఐ వెంకట్రావు అన్నారు. పిల్లల భద్రత అందరి బాధ్యత అని, ప్రతి కుటుంబం జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరారు.




