Nellore: ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎస్‌ఐఆర్ సమీక్ష!

Nellore: ఆత్మకూరులో వైఎస్సార్సీపీ ఎస్‌ఐఆర్ (SIR) వార్‌రూమ్ సమావేశం. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలన్న పేర్నాటి కోటేశ్వరరెడ్డి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 12 July 2026 5:19 PM IST
Nellore
X

Nellore: ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎస్‌ఐఆర్ సమీక్ష!

Nellore: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి సూచించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఫారాన్ని పరిశీలించి లోపాలను వెంటనే గుర్తించాలని అన్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ వార్‌రూమ్‌లో ఉదయగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, పార్లమెంటరీ ఎస్‌ఐఆర్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు కూనం సుధాకర్‌రెడ్డితో కలిసి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి బీఎల్‌ఏలకు పలు కీలక సూచనలు చేశారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జిల్లా స్థాయిలో వేగంగా సాగుతోందని పేర్కొంటూ, మిగిలిన నాలుగు రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును పూర్తి చేయించాలని సూచించారు. బీఎల్‌వోలు విధుల నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం, జాప్యం లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు, గుర్తించలేని ఓటర్ల జాబితాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయించాలని, దీనిపై నాయకులు బీఎల్‌ఏలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తైన తర్వాత కూడా అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుందని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించినట్లు గుర్తిస్తే వెంటనే ఆధారాలతో ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఓటర్ల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, చట్టబద్ధంగా పరిష్కారం పొందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకూరు సుబ్బారెడ్డి, సంగం మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ పంచాయతీ రాజ్ విభాగ కన్వీనర్ బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, గడ్డం శ్రీనివాసులరెడ్డి, బత్తిన నారాయణరెడ్డి, పాలేటి వెంగళరెడ్డి తదితరులు ఉన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story