Ongole: ఒంగోలులో ఏం జరిగింది? అర్ధరాత్రి భారీ శబ్దం.. వణికిపోయిన జనం!

Ongole: ఒంగోలు నగరంలోని సీతారాంపురం, శర్మ కాలేజీ పరిసరాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ శబ్దంతో కూడిన భూప్రకంపనలు సంభవించాయి.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 9 May 2026 7:56 AM IST
Ongole
X

Ongole: ఒంగోలులో ఏం జరిగింది? అర్ధరాత్రి భారీ శబ్దం.. వణికిపోయిన జనం!

Prakasam: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శర్మ కాలేజీ, సీతారాంపురం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. భారీ శబ్దంతో పాటు రెండు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్ల గోడలు, తలుపులు కంపించడంతో భూకంపం వచ్చిందేమోనన్న భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతసేపు ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం, మొదట పెద్ద శబ్దం వినిపించిందని, వెంటనే నేల కంపించినట్లు అనిపించిందని తెలిపారు.

కొందరు భవనాల పైకప్పులు, ఫ్యాన్లు కూడా స్వల్పంగా కంపించాయని చెప్పారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భూమి పొరల్లో మార్పులు చోటుచేసుకుని కంపనాలు సంభవించి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గతంలో కూడా ఇదే ప్రాంతంలో పలుమార్లు ఇలాంటి స్వల్ప కంపనలు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారికంగా భూకంప శాఖ లేదా రెవెన్యూ అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. భూమి కంపించిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story