Giddalur: కిష్టంసెట్టిపల్లిలో 'పొలం పిలుస్తోంది' రైతులకు ఎల్‌నినో సూచనలు

Giddalur: కిష్టంసెట్టిపల్లిలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం. ఎల్‌నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల రక్షణపై అవగాహన కల్పించిన ఉద్యాన శాఖ అధికారి డి. శ్వేత.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 28 July 2026 6:32 PM IST
Giddalur
X

Giddalur: కిష్టంసెట్టిపల్లిలో 'పొలం పిలుస్తోంది' రైతులకు ఎల్‌నినో సూచనలు

గిద్దలూరు: గిద్దలూరు మండలంలోని కిష్టంసెట్టిపల్లి గ్రామంలోపొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహణ. ఎల్‌నినో పరిస్థితుల్లో ఉద్యాన రైతులకు కీలక సూచనలు.

ఈరోజు గిద్దలూరు మండలంలోని కిష్టంసెట్టిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి డి. శ్వేత రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా రైతులకు ఎల్‌నినో పరిస్థితుల్లో అనుసరించాల్సిన ఐదు ముఖ్యమైన ముందస్తు చర్యలు గురించి వివరించడం జరిగింది.

1. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS):

వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందుగానే విత్తనాలు విత్తడం ద్వారా తొలి వర్షాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సమయానికి పంటలు స్థాపన చెంది దిగుబడులు మెరుగుపడతాయని వివరించారు.

2. ఫార్మ్ పాండ్ ఏర్పాటు:

వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఫార్మ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో పంటలకు జీవనాధార నీటిపారుదల అందించవచ్చని తెలియజేశారు.

3. మైక్రో ఇరిగేషన్ (డ్రిప్):

నీటి కొరత పరిస్థితుల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను కాపాడుకోవచ్చని, నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.

4. మల్చింగ్ వినియోగం:

ప్లాస్టిక్ లేదా సేంద్రీయ మల్చింగ్ ఉపయోగించడం ద్వారా నేలలో తేమ ఎక్కువకాలం నిలిచి, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గుతుందని రైతులకు సూచించారు.

5. పంటల బీమా:

ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడానికి పంటల బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా, ప్రస్తుతం గిద్దలూరు మండలంలో సుమారు 1,000 ఎకరాల్లో సాగులో ఉన్న చిక్కుడు (Dolichos Bean) మరియు గోరుచిక్కుడు (Cluster Bean) పంటలు ఎల్‌నినో ప్రభావంతో తేమ కొరత, అధిక ఉష్ణోగ్రతలు మరియు వేడి గాలుల కారణంగా వాడిపోయే పరిస్థితి ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ఈ పరిస్థితిలో రైతులు నేరుగా 19:19:19, 13:00:45 లేదా పొటాషియం నైట్రేట్ వంటి నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేయరాదని సూచించారు. అలా చేస్తే ఆకులపై స్కార్చింగ్ (ఆకు కాలిపోవడం) జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.

అందువల్ల రైతులు ముందుగా సాధారణ నీటిని మాత్రమే పంటపై పిచికారీ చేసి, మొక్కలకు తాత్కాలిక ఉపశమనం కలిగించాలి. అనంతరం 19:19:19 లేదా 13:00:45 లేదా పొటాషియం నైట్రేట్ వంటి నీటిలో కరిగే ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో పిచికారీ చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించి, పంటను కాపాడుకునే అవకాశం పెరుగుతుందని రైతులకు వివరించారు.

అదనంగా, సాధ్యమైనంత వరకు తేలికపాటి జీవనాధార నీటిపారుదల (Life Saving Irrigation), సేంద్రియ మల్చింగ్, కలుపు నివారణ మరియు నేలలో తేమను నిల్వ ఉంచే చర్యలు చేపట్టాలని సూచించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story