Markapur: మార్కాపురంలో బీజేపీ మీడియా ప్రతినిధి ఏలూరి ప్రెస్ మీట్

Markapur: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దేశ ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి వెల్లడి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Aug 2026 6:58 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో బీజేపీ మీడియా ప్రతినిధి ఏలూరి ప్రెస్ మీట్

మార్కాపూర్: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, రైతుల ఆదాయానికి మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.

మార్కాపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013-14లో 1.5 శాతం కంటే తక్కువగా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ ప్రస్తుతం 20 శాతానికి చేరిందని తెలిపారు. E20 ద్వారా ఇప్పటివరకు సుమారు 544 లక్షల మెట్రిక్ టన్నుల CO₂ ఉద్గారాలను తగ్గించడంతో పాటు 181 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు వినియోగాన్ని ప్రత్యామ్నాయంగా భర్తీ చేయగలిగామని, విదేశీ మారకద్రవ్య ఆదాలో సుమారు ₹1.06 లక్షల కోట్ల ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు.

ఇథనాల్ తయారీకి వ్యవసాయ ఆధారిత ముడి పదార్థాలను వినియోగించడం ద్వారా రైతులకు అదనపు మార్కెట్, ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులను ప్రజలు స్వాగతించాలని, E20 ఇంధనం నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. అలాగే E20 ఇంధనంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఏలూరి విమర్శించారు.

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న ఇంధన సంస్కరణలను రాజకీయ కోణంలో చూడకుండా వాస్తవాలను అర్థం చేసుకోవాలని సూచించారు.. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని, 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు, జిల్లా కార్యదర్శి మద్దెల లక్ష్మీదేవి, నాయకులు దేవిశెట్టి చంద్ర శేఖర్, మండ్ల శివ ప్రసాద్, బొంతల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story