Markapuram: సర్జరీకి వెళ్లిన యజమాని.. ఇల్లు గుల్ల చేసిన దొంగలు
Markapuram: దేవరాజుగట్టులో ఘోర కలికలం. ఆనేకాళ్ళ వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో సుమారు రూ. 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లారు.
Markapuram: సర్జరీకి వెళ్లిన యజమాని.. ఇల్లు గుల్ల చేసిన దొంగలు
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆనేకాళ్ళ వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి సుమారు రూ.35 నుంచి 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు.
వెంకటేశ్వర రెడ్డి సర్జరీ నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దుండగులు రాత్రి వేళ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదును అపహరించినట్లు సమాచారం.
సాయంత్రం వెంకటేశ్వర రెడ్డి అత్త మెట్టు వెంకటలక్ష్మిమ్మ ఇంటి తలుపులు తీసి చూడగా ఇంట్లో సామాన్లు చిందరవందరగా ఉండటం, బీరువాలు పగులగొట్టబడటం గమనించి చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఐ అజయ్ కుమార్, ఎస్సై సైదుబాబు, ఫోరెన్సిక్ బృందం ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను సేకరించి దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ పహారా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




