Prakasam: ఒంగోలు కలెక్టరేట్ వద్ద 'ఆపరేషన్ క్లీన్ స్వీప్'.. రంగంలోకి కలెక్టర్, ఎమ్మెల్యే!
Prakasam: ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత లక్ష్యంతో ఒంగోలులో మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. రోడ్లు ఊడ్చి, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిన కలెక్టర్, సంతనూతలపాడు ఎమ్మెల్యే.
Prakasam: ఒంగోలు కలెక్టరేట్ వద్ద 'ఆపరేషన్ క్లీన్ స్వీప్'.. రంగంలోకి కలెక్టర్, ఎమ్మెల్యే!
ప్రకాశం జిల్లా: ఒంగోలు కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత లక్ష్యం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, సంతనూతలపాడు శాసన సభ్యులు శ్రీ బి.ఎన్. విజయకుమార్ కలిసి పాల్గొని పారిశుద్ధ్య పనులను స్వయంగా నిర్వహించారు.
కలెక్టరేట్ పరిసరాల్లో చెత్తను తొలగించడం, రోడ్లను శుభ్రపరచడం, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం వంటి కార్యక్రమాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే నేరుగా పాల్గొనడంతో అధికారులు, సిబ్బంది, ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, కార్యాలయాలు, వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.




