Pedda Dornala: పెద్దదోర్నాలలో ప్రజాప్రతినిధుల నిరసన.. అధికారుల తీరుపై ధ్వజం
Pedda Dornala: పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Pedda Dornala: పెద్దదోర్నాలలో ప్రజాప్రతినిధుల నిరసన.. అధికారుల తీరుపై ధ్వజం
పెద్ద దోర్నాల: పెద్ద దోర్నాల, మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంపై ప్రజాప్రతినిధులు, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అధికారులు ముందుగానే నోటీసులు జారీ చేశారని, సమావేశం జరగాల్సిన రోజున ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమావేశాన్ని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి హాజరైన సమయంలో సమావేశం రద్దు చేయడం ప్రజాప్రతినిధులను అవమానించడమేనని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసే సర్వసభ్య సమావేశాలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, కేవలం ప్రజాప్రతినిధుల హాజరు తీసుకోవడం మాత్రమే కాకుండా ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమావేశాలను అధికారులు తమ ఇష్టానుసారం నిర్వహించడం, రద్దు చేయడం సరికాదని, ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా చూడాలని, ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. సర్వసభ్య సమావేశం రద్దుకు కారణాలను సంబంధిత అధికారులు స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, ఎంపిటిసిలు, కో ఆప్షన్ సభ్యులు పటాన్ వహాబ్ ఖాన్, వైయస్సార్సీపి మండల అధ్యక్షులు గంటా వెంకటరమణారెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




