Parchur: పర్చూరు ఇనాం భూముల పట్టాలకు మోక్షం.. ఎమ్మెల్యే చొరవతో వేగం!

Parchur: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇనాం భూముల సమస్యకు మోక్షం లభించనుంది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 30 Jun 2026 6:56 PM IST
Parchur
X

Parchur: పర్చూరు ఇనాం భూముల పట్టాలకు మోక్షం.. ఎమ్మెల్యే చొరవతో వేగం!

పర్చూరు: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇనాం భూముల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పర్చూరు, మార్టూరు మండలాల పరిధిలోని నాలుగు గ్రామాల్లో రైతువారీ పట్టాల మంజూరు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నిరంతర కృషి ఫలితంగా ఈ అంశం ప్రభుత్వ ఉన్నతస్థాయికి చేరింది. ఆయన విజ్ఞప్తి మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమస్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళి సత్వర పరిష్కారం కోరారు.

ఇనాం భూముల అంశంపై ఎమ్మెల్యే ఏలూరి గతంలోనూ పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి రైతులకు పట్టాలు మంజూరు చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఆయన కృషి ఫలితంగానే ప్రస్తుతం ప్రభుత్వం ఈ దిశగా చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలం లక్కవరం, జంగమహేశ్వరపురం, పర్చూరు మండలం ఎడుబాడు, చెన్నుంబొట్ల అగ్రహారం గ్రామాల్లో 70-80 ఏళ్లుగా రైతులు ఇనాం, ఎస్టేట్ భూములను సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఏలూరి రెవెన్యూ మంత్రికి వివరించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడంతో సంక్షేమ, సబ్సిడీ పథకాల ప్రయోజనం అందడం లేదని, వెంటనే పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే సిఫారసుతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో, సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వేగంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ వివరాల ప్రకారం పర్చూరు మండలం చెన్నుంబొట్ల అగ్రహారంలో 803.02 ఎకరాలపై 518 మంది, ఎడుబాడులో 1,104.75 ఎకరాలపై 630 మంది, మార్టూరు మండలం లక్కవరంలో 565.84 ఎకరాలపై 390 మంది, జంగమహేశ్వరపురంలో 2,465.27 ఎకరాలపై 1,529 మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం నాలుగు గ్రామాల్లో 4,938.88 ఎకరాల ఇనాం భూమిపై 3,067 మంది రైతుల భవితవ్యం ముడిపడి ఉంది.

సర్వేలు, నోటిఫికేషన్లు, నివేదికల ప్రక్రియలు పూర్తయినప్పటికీ కొన్ని ప్రతిపాదనలు సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉండటంతో పట్టాల మంజూరులో జాప్యం జరిగింది. ప్రస్తుతం సీఎస్ స్థాయిలోనూ సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో, ఈ నెల 8న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇనాం భూముల అంశంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం లభిస్తే దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది రైతులకు త్వరలోనే పట్టాలు లభించే వీలుంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story