Yerragondapalem: వెలిగొండ కృష్ణమ్మకు జలహారతి సమర్పించిన ఎరిక్షన్ బాబు!
Yerragondapalem: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా జలాలకు టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జలహారతి సమర్పించారు.
Yerragondapalem: వెలిగొండ కృష్ణమ్మకు జలహారతి సమర్పించిన ఎరిక్షన్ బాబు!
యర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ రెగ్యులేటర్ వద్ద కృష్ణా జలాలకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు, స్థానిక నాయకులు, మహిళలతో కలిసి జలహారతి నిర్వహించారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీర సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో మార్కాపురం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడిందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించడంతో పాటు పనుల పురోగతికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అందించేందుకు కూడా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టులో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతుండటాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన కల సాకారమైందని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు వద్ద 20 రోజుల పాటు కొనసాగనున్న ఈ మహా యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు. కృష్ణా జలాలకు ఘన స్వాగతం పలుకుతూ నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




