Amalapuram: రేపే కోనసీమ జిల్లాలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 4.0
Amalapuram: కోనసీమ జిల్లాలో శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 4.0 నిర్వహణ. 1,409 పాఠశాలల్లో జరగనున్న సభకు తల్లిదండ్రులు హాజరుకావాలని కలెక్టర్ విజ్ఞప్తి.
Amalapuram: రేపే కోనసీమ జిల్లాలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 4.0
అమలాపురం: విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్ ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) 4.0 కార్యక్రమం శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా జరగనుందని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
జిల్లాలోని 1,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. 76,132 మంది విద్యార్థులు పాల్గొనే ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, అభ్యసన ఫలితాలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విద్యా పథకాల అమలుపై తల్లిదండ్రులకు వివరించనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేయడంతో పాటు LEAP యాప్ వినియోగంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఇద్దరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ వివరాలను గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.




