Amalapuram: అమలాపురం ముగిసిన కాయర్ పరిశ్రమల అవగాహన సదస్సు
Amalapuram: అమలాపురంలో ముగిసిన రెండు రోజుల కాయర్ పరిశ్రమల సదస్సు. స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఉపాధి పెంచడమే లక్ష్యమని తెలిపిన జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి.
Amalapuram: అమలాపురం ముగిసిన కాయర్ పరిశ్రమల అవగాహన సదస్సు
అమలాపురం: డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME), కాయర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల "కొబ్బరి నార (కాయర్) వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రదర్శన" సదస్సు శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది.
జూలై 16, 17 తేదీల్లో నిర్వహించిన ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాయర్ పరిశ్రమల స్థాపన, ఆధునిక యంత్రాల వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ప్రభుత్వ సబ్సిడీలు, రుణ సదుపాయాలపై నిపుణులు అవగాహన కల్పించారు.
ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి వైఖోమ్ నైడియా దేవి మాట్లాడుతూ, జిల్లాలో కాయర్ పరిశ్రమల అభివృద్ధికి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడిందన్నారు. భవిష్యత్తులో కూడా పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
స్థానికంగా లభించే కొబ్బరి, అరటి తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాయర్ బోర్డు, MSME, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.




