Razole: రాష్ట్ర ఆహార కమిషన్ తనిఖీలు: హాస్టళ్లు, అంగన్వాడీల పరిశీలన!
Razole: సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల్లో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్రెడ్డి, సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్ తనిఖీలు చేశారు.
Razole: రాష్ట్ర ఆహార కమిషన్ తనిఖీలు: హాస్టళ్లు, అంగన్వాడీల పరిశీలన!
రాజోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్రెడ్డి, కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ తో కలిసి రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
మామిడికుదురు సాంఘిక సంక్షేమ హాస్టల్ను తనిఖీ చేసి, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తాటిపాక,సోంపల్లి అంగన్వాడీ కేంద్రాలనం కూడా కమిషన్ బృందం పరిశీలించింది. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, గుడ్లు, ఇతర ఆహార పదార్థాల నాణ్యత, స్టాక్ వివరాలను పరిశీలించి, చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.
రాజోలు రేషన్ షాపును తనిఖీ చేసిన కమిషన్ చైర్మన్, సభ్యులు బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం రాజోలు అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, హాస్టల్ను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని, అవసరమైన పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు, చిన్నారులు, పేద ప్రజలకు అందుతున్న ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సక్రమంగా అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల్లో ఆహార నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానాలను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. విద్యార్థులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ శాఖ ఉన్నతాధికారులు, అంగన్వాడీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఎస్సీ సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.




