Razole: రాజోలులో చిరంజీవి అభిమానుల మెగా రక్తదాన శిబిరం!
Razole: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాజోలులో మెగా యూత్ ఫోర్స్ రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్.
Razole: రాజోలులో చిరంజీవి అభిమానుల మెగా రక్తదాన శిబిరం!
Razole: పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రాజోలు మండలం శివకోటి గ్రామంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరంతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలన, హెల్మెట్ వినియోగంపై యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..తాను ఏ హీరోకూ అభిమాని కాదని, చిరంజీవి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మాత్రం దాసుడినని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైతే వ్యక్తిగత జీవితం నాశనం కావడంతో పాటు కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడటం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాపాయాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
అభిమానులు ఫ్లెక్సీలు, డీజే సౌండ్లకు అధికంగా డబ్బు ఖర్చు చేయకుండా తమ అభిమాన హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. రక్తదానం, సామాజిక సేవ వంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా అభిమానాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాజోలు సీఐ సురేష్ బాబు, మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ సుదా చిన్న, జాయింట్ కన్వీనర్ కోళ్ల బాబి, గుండాబత్తుల తాతాజీ, వులిశెట్టి లక్ష్మణరావు, సూరిశెట్టి శ్రీనివాస్,దూది స్వామి, కుంపట్ల చిన్నారి తదితరులు పాల్గొన్నారు.




