East Godavari: ప్రత్యేక సవరణ (SIR) నేపథ్యంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

East Godavari: తూర్పు గోదావరి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 18 Jun 2026 1:04 PM IST
East Godavari
X

East Godavari: ప్రత్యేక సవరణ (SIR) నేపథ్యంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 

తూర్పు గోదావరి: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి జిల్లాలోని మొత్తం 18,46,723 మంది ఓటర్లకు సంబంధించి 2,85,081 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం జరిగిందని, ఇది మొత్తం ఓటర్లలో 15.44 శాతం అని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం జిల్లాలో మొత్తం 1,804 మంది బూత్ లెవల్ అధికారులు (BLOలు) నియమించగా, వారిలో 1,755 మందికి శిక్షణ పూర్తయిందని, మిగిలిన 49 మందికి త్వరలో శిక్షణ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పురోగతి ఇలా ఉందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో 2,27,053 మంది ఓటర్లకు గాను 67,841 ఫారాలు పంపిణీ చేసి 29.88 శాతం నమోదు చేసింది. మండపేటలో 2,21,015 మంది ఓటర్లకు గాను 32,931 ఫారాలు పంపిణీ చేసి 14.90 శాతం పురోగతి సాధించింది. రాజానగరంలో 2,17,026 మంది ఓటర్లకు గాను 23,658 ఫారాలు పంపిణీ చేసి 10.90 శాతం నమోదైంది.

రాజమహేంద్రవరం సిటీలో 2,65,721 మంది ఓటర్లకు గాను 35,477 ఫారాలు పంపిణీ చేసి 13.35 శాతం పురోగతి సాధించింది. రాజమహేంద్రవరం రూరల్‌లో 2,73,582 మంది ఓటర్లకు గాను 41,385 ఫారాలు పంపిణీ చేసి 15.13 శాతం నమోదు చేసింది. కొవ్వూరు నియోజకవర్గంలో 1,84,859 మంది ఓటర్లకు గాను 23,681 ఫారాలు పంపిణీ చేసి 12.81 శాతం పురోగతి సాధించింది. నిడదవోలులో 2,13,996 మంది ఓటర్లకు గాను 24,336 ఫారాలు పంపిణీ చేసి 11.37 శాతం నమోదు చేసింది.

గోపాలపురం నియోజకవర్గంలో 2,43,471 మంది ఓటర్లకు గాను 35,772 ఫారాలు పంపిణీ చేసి 14.69 శాతం పురోగతి సాధించింది. అలాగే ఇప్పటివరకు 1,372 ఫారాలు డిజిటైజ్ చేయడం జరిగిందని, ఈ ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.

ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని, ఓటర్లు వారికి సహకరించి ఫారాలను పూర్తి వివరాలతో అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి కోరారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story