Rajahmundry: పుష్కరాల నాటికి కాలుష్యరహిత గోదావరి.. ఈఎన్సీ స్పష్టత!
Rajahmundry: రాబోయే పుష్కరాల నాటికి గోదావరి నదిని పూర్తిస్థాయిలో కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఎం. ప్రభాకర్ రావు రాజమండ్రిలో తెలిపారు.
Rajahmundry: పుష్కరాల నాటికి కాలుష్యరహిత గోదావరి.. ఈఎన్సీ స్పష్టత!
రాజమండ్రి: గోదావరి పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే పుష్కరాల నాటికి గోదావరి నది జలాలను పూర్తి స్థాయిలో కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను వేగవంతం చేసినట్లు ఇంజనీర్-ఇన్-చీఫ్ (పబ్లిక్ హెల్త్) ఎం. ప్రభాకర్ రావు తెలిపారు.
'కాలుష్యరహిత గోదావరి' లక్ష్యంగా మురుగునీటి మళ్లింపు అంశాన్ని పరిశీలించేందుకుగాను శుక్రవారం నగరంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాతేరు, ధవళేశ్వరం సహా మురుగునీరు గోదావరి నదిలో కలుస్తున్న పలు ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గోదావరి నదిలోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించేందుకు సాంకేతిక సాధ్యాసాధ్యాలపై చర్చించారు. హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న 50 ఎంఎల్డీ సామర్థ్యంతో కూడిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులు తుది దశకు చేరుకున్నాయని ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.
వచ్చే ఏడాది పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన గోదావరిని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అన్ని పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు క్షేత్ర స్థాయిలో పరిశీలన సందర్భంగా సూచనలు చేశారు. శాశ్వత పరిష్కారాల కోసం అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై వారం రోజుల్లోగా సమగ్ర ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్ఈ(ఇంజనీరింగ్) రీటా, ఈఈ మదార్ షా అలీ, ఎస్ఈ(పబ్లిక్ హెల్త్) రత్నాకర్ రెడ్డి, ఈఈ శేషగిరి రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




