Rajanagaram: వీరలంకపల్లి గురుకులంలో విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు!

Rajanagaram: గోకవరం అంబేద్కర్ గురుకులంలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ తిరన్ ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 10 Sept 2026 4:58 PM IST
Rajanagaram
X

Rajanagaram: వీరలంకపల్లి గురుకులంలో విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు!

Rajanagaram: గోకవరం మండలం వీరలంకపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల వసతి గృహాన్ని జి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తిరన్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు.

అనంతరం వసతి గృహ ప్రిన్సిపాల్ జ్యోత్స్నా సుగుణవల్లి సమక్షంలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరన్ మాట్లాడుతూ, “మీరు ఒంటరిగా లేరు.. మేము మీతో ఉన్నాము” అనే ఈ ఏడాది నినాదాన్ని గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ ధైర్యంగా జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.

ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు జీవితాన్ని ముగించుకోవద్దని, ఎదురైన సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకాలని విద్యార్థినులకు సూచించారు. మానసికంగా బాధ, నిరాశ, తీవ్ర ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 14416 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి అవసరమైన సలహాలు, సహాయం పొందవచ్చని తెలిపారు.

అనంతరం వసతి గృహంలో తనిఖీలు నిర్వహించి ప్రతి గదిలో దోమతెరలను సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా పరిశీలించారు. దోమల కాటుకు గురికాకుండా ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా దోమతెరలను ఉపయోగించాలని సూచించారు. ఈ విషయమై సిబ్బందికి కూడా పలు సూచనలు చేశారు.

వసతి గృహంలోని డైనింగ్ హాల్, వంటగది నిర్వహణను పరిశీలించి, వండిన ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన తాగునీటి సరఫరాపై సిబ్బందికి తగిన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ నర్స్ వెంకటరమణ, ఎంఎల్‌హెచ్‌పీ రమ్య, ఏఎన్‌ఎం వెంకటలక్ష్మి, ఎంపీహెచ్‌ఏలు నాగేశ్వరరావు, పవన్, రమణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM