Amalapuram: అమలాపురంలో టీడీపీ ఆత్మీయ సమావేశం.. కీలక తీర్మానాలు!
Amalapuram: టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం ఆరోగ్యశ్రీ స్థానంలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు, ఉపాధి హామీ నిధులు, పింఛన్లు మరియు ఇళ్ల బిల్లుల చెల్లింపులపై పలు కీలక తీర్మానాలు చేశారు.
Amalapuram: అమలాపురంలో టీడీపీ ఆత్మీయ సమావేశం.. కీలక తీర్మానాలు!
అమలాపురం: డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఇన్చార్జ్లు, కో-కన్వీనర్ల నెలవారీ ఆత్మీయ సమావేశం ఆదివారం అమలాపురం కాటన్ గెస్ట్హౌస్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాలతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద కొత్త కార్డులను మంజూరు చేసి ప్రజలకు అందించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే VB-RAM G (NREGS) పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోడ్ల పనులకు ఆటంకం లేకుండా అదనపు నిధులు కేటాయించి, గ్రామాల్లో అవసరమైన కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.
పార్టీ నిర్వహిస్తున్న డోర్ టు డోర్ (D2D) కార్యక్రమంలో గ్రామాల్లో ప్రజల నుంచి ప్రధానంగా కొత్త పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, 2014–19 మధ్య కాలంలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై విజ్ఞప్తులు వస్తున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. ప్రజల నుంచి వస్తున్న ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
అదేవిధంగా జిల్లా పార్టీ సూచన మేరకు గన్నవరం నియోజకవర్గానికి ఇన్చార్జ్ను త్వరగా నియమించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతూ మరో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాజోలు ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య, గన్నవరం నియోజకవర్గ కన్వీనర్లు మోకా ఆనందసాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.




