Amalapuram: హిందూపురం టు ఇచ్చాపురం.. మాలల ఐక్యతా చైతన్య యాత్ర!
Amalapuram: అమలాపురంలో మాల సంఘాల ఆధ్వర్యంలో ఐక్యతా చైతన్య యాత్ర కార్యాచరణ ప్రకటన. ఎస్సీ వర్గీకరణ రద్దు, 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్.
Amalapuram: హిందూపురం టు ఇచ్చాపురం.. మాలల ఐక్యతా చైతన్య యాత్ర!
అమలాపురం: మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు అమలాపురంలో సమావేశమై మాలల ఐక్యతా చైతన్య యాత్రకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని, దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని,దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.మాలలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
అలాగే మాలలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది మాలలు ఉన్నారని,45 లక్షల వరకు ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం ఎన్నికల సమయంలో మాలల ఓట్లు అవసరమవుతున్నాయని, కానీ అనంతరం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యతా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఎస్సీ వర్గీకరణ,రిజర్వేషన్ల అమలు,ఉద్యోగ అవకాశాల పంపిణీలో మాలలకు అన్యాయం జరుగుతోందని నాయకులు ఆరోపించారు.దళిత క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని,రాజ్యాంగం కల్పించిన సమానత్వం,మత స్వేచ్ఛ హక్కులను పరిరక్షించాలని కోరారు.మాలల కులగుర్తింపు, రాజ్యాంగ హక్కులను కాపాడే ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
త్వరలో విజయవాడలో 10 లక్షల మంది మాలలతో భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో మల్లెల వెంకటరావు,కోట్ల గంగాధర్, సుబ్బారాయుడు,మామిడి సునీల్,మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




