Mamidikuduru: మామిడికుదురు తీర ప్రాంతాల్లో విస్తృతంగా విత్తనాల పెంపు
Mamidikuduru: మామిడికుదురు మండలం కరవాక, గోగన్నమఠం తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతి ప్రేమికులు సుమారు 5 వేల విత్తనాలు నాటారు.
Mamidikuduru: మామిడికుదురు తీర ప్రాంతాల్లో విస్తృతంగా విత్తనాల పెంపు
మామిడికుదురు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీర ప్రాంత ఫారెస్ట్ ఏరియాల్లో ప్రకృతి ప్రేమికులు విస్తృతంగా విత్తనాలు నాటారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు ఈ ఏడాది జూన్ 5 నుంచి నిర్వహిస్తున్న ‘హరిత భవిష్యత్తు కోసం అందరం ఏకమౌదాం’ కార్యక్రమంలో భాగంగా మామిడికుదురు మండలం కరవాక, గోగన్నమఠం తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.
కేశనపల్లికి చెందిన రైతు పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షుడు కల్వకొలను దొరబాబు, పాలకొల్లుకు చెందిన ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ నిపుణుడు పాటబళ్ల వెంకటస్వామి, కేశనపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సుమారు 5 వేల విత్తనాలు నాటారు. గానుగ, వేప, మారేడు, జామ, రావి, చింత తదితర జాతుల విత్తనాలను తీర ప్రాంత ఫారెస్ట్ ఏరియాల్లో నాటినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, వాతావరణంలో చోటుచేసుకునే పెను మార్పుల ప్రభావాన్ని మహావృక్షాలు కొంతమేర తగ్గిస్తాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో సుమారు 15 మంది ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు.




