Rampachodavaram: ఏపీవ్యాప్తంగా నీరా ప్రాజెక్టుల ప్రోత్సాహానికి చర్యలు!
Rampachodavaram: ఉద్యాన పరిశోధన కేంద్రంలో నీరా ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర, గీత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Rampachodavaram: ఏపీవ్యాప్తంగా నీరా ప్రాజెక్టుల ప్రోత్సాహానికి చర్యలు!
రంపచోడవరం: రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పోలవరం జిల్లా లో పర్యటించారు.ముందుగా సీతపల్లి బాపనమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.మంత్రికి రంపచోడవరం ఏమ్మెల్యే శిరీష దేవి,మాజీ ఏమ్మెల్యే లు ఘనస్వాగతం పలికారు.
అనంతరం నీరా ప్రాజెక్టు ప్రోత్సాహం స్థాపనపై రంపచోడవరం పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రం ని సందర్శించారు.తాటి ఉత్పత్తుల కోసం ఉద్యానవన అధికారులను అడిగి తెలుసుకున్నారు.తాటి ఉత్పత్తులు ఏ విధంగా ఉపయోగపడతాయో అని ఉద్యానవన అధికారులను ఆరా తీశారు.తాటి ఉత్పత్తులు నుండి నీరా తీసే పరికరాలను పరిశీలించి,తాటి ప్లాంటేషన్ ను సందర్శించారు.మంత్రి కొల్లు రవీంద్ర నీరా ప్రాజెక్ట్ ప్రోత్సాహం స్థాపన పై కల్లుగీత కార్మికులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి కల్లుగీత కార్మికులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర సమావేశం లో మాట్లాడుతూ తాటి ఆధారిత జీవనోపాధిపై ఆధారపడిన కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. నీరా ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించడం ద్వారా కల్లుగీత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తాటి చెట్ల నుంచి సేకరించే నీరాను ఆరోగ్యకరమైన పానీయంగా ప్రజల్లో విస్తృతంగా ప్రాచుర్యం కల్పించి, దానికి మార్కెట్ అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాటి ఉత్పత్తులకు విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు రైతులు, కల్లుగీత కార్మికులకు ఎంతో ఉపయోగపడేలా ఉండాలని అధికారులకు సూచించారు. తాటి బెల్లం, తాటి చక్కెర, తాటి పానీయాలు, ఇతర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించి మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని, వారికి అవసరమైన భద్రతా పరికరాలు, శిక్షణ, సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాటి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.




