Rajahmundry: ప్రియాంక కుటుంబానికి రూ.30 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు!

Rajahmundry: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కలచివేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేయగా, సీఎం రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 10 Aug 2026 3:10 PM IST
Rajahmundry
X

Rajahmundry: ప్రియాంక కుటుంబానికి రూ.30 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు!

Rajahmundry: వైద్య విద్యార్థిని ప్రియాంక అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎంతో కష్టపడి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తమ కుమార్తెను డాక్టర్‌గా చూడాలన్న తల్లిదండ్రుల కల ఇలా విషాదాంతం కావడం అత్యంత బాధాకరమన్నారు.

ఎంతో కష్టపడి కూతురిని వైద్య విద్య చదివించిన ఆ బీసీ కుటుంబం ప్రస్తుతం అనుభవిస్తున్న ఆవేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. డాక్టర్‌గా తమ కుమార్తెను చూడాలన్న తల్లిదండ్రుల ఆశలు, ఎన్నో సంవత్సరాల కష్టం ఒక్కసారిగా ఆవేదనగా మారడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోందన్నారు.

ఆదివారం హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రయాణంలో బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి, వారి పరిస్థితిని తెలుసుకున్నానని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి ఆవేదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు, కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కష్ట సమయంలో ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రియాంక మరణానికి సంబంధించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి, వాస్తవాలు వెలుగులోకి రావాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. దర్యాప్తు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఒక బీసీ కుటుంబం తమ కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దేందుకు చేసిన త్యాగం, కష్టం వృథా కాకూడదని, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ప్రియాంక కుటుంబం ఒంటరిగా లేదని, ఈ క్లిష్ట సమయంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాను కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే వాసు భరోసా ఇచ్చారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రార్థించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story