Rajahmundry: రాజమహేంద్రవరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామన్న ఆదిరెడ్డి!
Rajahmundry: రాజమండ్రి 33వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించి, రూ. 5 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
Rajahmundry: రాజమహేంద్రవరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామన్న ఆదిరెడ్డి!
రాజమండ్రి: స్థానిక 33వ డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో అడుగు పడింది. లక్ష్మీవారపుపేట శివాలయం వీధి ప్రాంతంలో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 40 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను 100 కేవీ డీటీఆర్గా అప్గ్రేడ్ చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన "మన వార్డులో – మన ఆదిరెడ్డి" కార్యక్రమంలో స్థానికులు లో వోల్టేజ్ సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించి కేవలం వారం రోజుల్లోనే 40 కేవీ ట్రాన్స్ఫార్మర్ను 100 కేవీగా అప్గ్రేడ్ చేయడం జరిగిందని చెప్పారు. సమస్యను వేగంగా పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అదే విధంగా శివాలయం వెనుక ఉన్న డ్రైనేజీ సమస్యతో పాటు బుద్ధుడు ఆసుపత్రి నుంచి స్వర్ణ మంజరి జ్యువెలరీ వరకు ఉన్న ప్రధాన డ్రైనేజీ అధ్వాన్నంగా ఉండటంతో రూ.5 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన "మన వార్డులో – మన ఆదిరెడ్డి" కార్యక్రమంలో ప్రజలు కోరిన మరో అభివృద్ధి పనిగా దావత్ బిర్యానీ ఎదురుగా ఉన్న ఎరుకలవారి వీధి – భక్తులరాజు వీధి రహదారి అభివృద్ధికి రూ.11.50 లక్షలు మంజూరయ్యాయని, వచ్చే ఒకటి లేదా రెండు నెలల్లో ఆ పనులను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.
33వ డివిజన్లోని లక్ష్మీవారపుపేట శివాలయం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.55 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని, త్వరలో ఆలయ కమిటీ, భక్తులతో సమావేశమై జరుగుతున్న పనులను సమీక్షించి వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
నగరంలో పుష్కరాల నేపథ్యంలో చేపట్టనున్న డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ.140 కోట్లు ఆమోదం పొందాయని, త్వరలోనే ఆ పనులు ప్రారంభించి రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




