Rajahmundry: పాఠశాల, ఆలయ అభివృద్ధికి భారీ విరాళాలు..
Rajahmundry: రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను కలసి దాతలు పాఠశాల ఆలయ ఆర్చ్ నిర్మాణం కోసం విరాళాలు అందజేశారు
Rajahmundry: పాఠశాల, ఆలయ అభివృద్ధికి భారీ విరాళాలు..
రాజముండ్రి: సమాజాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు, దేవాలయాలు, ప్రజా అవసరాలకు ఉదారంగా విరాళాలు అందిస్తున్న దాతలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.
విఎల్ పురంలోని శ్యామలాంబ పాఠశాల అభివృద్ధి కోసం తోట మోహన్ శ్రీరామ కిరణ్ రూ.50,000 విరాళాన్ని, కోటిలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మిస్తున్న స్వాగత ఆర్చ్ నిర్మాణానికి తోట వెంకటేశ్వరరావు రూ.1,00,000 విరాళాన్ని శనివారం తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం తోడైతే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
విద్యాభివృద్ధికి, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వడం గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో ముందుకు వస్తున్న దాతలను అభినందిస్తూ, వారి సేవా భావం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని, అదే సమయంలో సామాజిక బాధ్యతతో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందిస్తే విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
విరాళాలు అందించిన తోట మోహన్ శ్రీరామ కిరణ్, తోట వెంకటేశ్వరరావులను ఎమ్మెల్యే వాసు ప్రత్యేకంగా అభినందించి, వారి సేవా దృక్పథాన్ని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో చల్లా కేశవరావు, చల్లా బాలమురళి, కంటిపూడి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




