P Gannavaram: పి.గన్నవరంలో భారీ అభివృద్ధి పనులు ఎమ్మెల్యే సత్యనారాయణ వెల్లడి
P Gannavaram: నియోజకవర్గంలో రూ. 17.69 కోట్లతో పంచాయతీ రాజ్ రోడ్లు, ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.
P Gannavaram: పి.గన్నవరంలో భారీ అభివృద్ధి పనులు ఎమ్మెల్యే సత్యనారాయణ వెల్లడి
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రోడ్లు, ఆలయాలు, నెట్వర్క్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునర్నిర్మాణానికి సంబంధించి భారీ స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖామంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
రూ.17.69 కోట్లతో పంచాయతీ రాజ్ రోడ్లు
కోనసీమ జిల్లాకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరైన రూ. 94 కోట్ల నిధుల్లో ప్రత్యేకంగా పి.గన్నవరం నియోజకవర్గానికి రూ.17.69 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 16 రోడ్లను నిర్మించనున్నట్లు తెలియజేశారు. అత్యవసరంగా ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపధ్యంలో, మంగళ, బుధవారాల్లోనే వీటికి శంకుస్థాపనలు చేసి పనులను పట్టాలెక్కించనున్నారు.
పుష్కర ఘాట్లు, దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత
రాబోయే గోదావరి పుష్కరాల నేపధ్యంలో నియోజకవర్గంలోని పుష్కర ఘాట్ల ఆధునీకరణకు గాను రూ.8.39 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పుష్కర బడ్జెట్ కింద రూ.35 కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఆర్ అండ్ బి (R&B) రోడ్లు, బ్రిడ్జిల ప్రతిపాదనలు నియోజకవర్గంలో దెబ్బతిన్న చిన్న చిన్న బ్రిడ్జిలు, పెండింగ్ రోడ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి శాసనసభ వేదికగా ప్రతిపాదనలు సమర్పించానని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారన్నారు. అదేవిధంగా దెబ్బతిన్న బ్రిడ్జిల నిర్మాణానికి రూ.19 కోట్లతో ప్రపోజల్స్ ఆర్ అండ్ బి మంత్రికి అందజేసామన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో మిగిలి ఉన్న ప్రధాన ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం కోసం రూ. 72.70 కోట్లతో నివేదిక సమర్పించగా, సంబంధిత అధికారులకు వెంటనే ప్రాసెస్ చేయాలని మంత్రి వారికి ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. సేవా దృక్పథంతో, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు వేగవంతమైన పాలన మరియు సమగ్ర అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు.




