Nidadavolu: తాళ్లపాలెం అండర్ బ్రిడ్జి నీటి సమస్యపై మంత్రి సమీక్ష
Nidadavolu: ఢిల్లీ పర్యటన ముగించుకుని రాగానే నిడదవోలులో అండర్ బ్రిడ్జి నీటి నిల్వ సమస్యపై అధికారులతో సమీక్షించిన మంత్రి కందుల దుర్గేష్.
Nidadavolu: తాళ్లపాలెం అండర్ బ్రిడ్జి నీటి సమస్యపై మంత్రి సమీక్ష
నిడదవోలు: నాలుగు రోజుల రాజస్థాన్, న్యూఢిల్లీ పర్యటనలను దిగ్విజయంగా ముగించుకుని నిడదవోలు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గ సమస్యలపై వెంటనే సమీక్ష చేపట్టారు.
గత కొన్ని రోజులుగా తాళ్లపాలెం అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిపోతున్న వర్షపు నీటి సమస్యపై సంబంధిత అధికారులతో మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్షపు నీటిని వెంటనే బయటకు తోడేసేందుకు అవసరమైన మోటార్లను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
పరిసర ప్రాంతాల చేలు, కాలువల నుండి నీరు బ్రిడ్జిలోకి చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు, నీరు సజావుగా బయటకు వెళ్లేలా పైప్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో ప్రయాణికులు, వాహనదారులకు రాకపోకల ఇబ్బందులు లేకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
ఇటీవలే ముంబయి పర్యటనలో ఉన్న సమయంలో కూడా మంత్రి దుర్గేష్ వీడియో కాల్ ద్వారా స్పందించి, జిల్లా అధికార యంత్రాంగంతో పాటు కూటమి నాయకులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిన విషయం విదితమే. రాబోయే రోజుల్లో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన స్పష్టంగా ఆదేశించారు.
ఈ అత్యవసర సమీక్షా సమావేశంలో ఎంపీడీవో, జలవనరుల శాఖ ఏఈ , రైల్వే, ఆర్ అండ్ బీ అధికారులు మరియు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




