P Gannavaram: మూడు గ్రామాల్లో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన!
P Gannavaram: కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ PMAGY పథకం కింద రూ.60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
P Gannavaram: మూడు గ్రామాల్లో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన!
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఉడిమూడి, నరేంద్రపురం, వై. కొత్తపల్లి గ్రామాల్లో ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) పథకం కింద రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గ్రామాల్లో నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పి. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నరేంద్రపురం గ్రామ మహిళలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో దాదాపు పదేళ్లుగా సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. అయితే తమ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించడమే కాకుండా ఈరోజు శంకుస్థాపన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకి గ్రామ మహిళలు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




