P.Gannavaram: నరేంద్రపురం గురుకులంలో 'అనంత అరణ్య' ప్రాజెక్ట్ ప్రారంభం
P.Gannavaram: నరేంద్రపురం గురుకుల పాఠశాలలో అనంత అరణ్య ప్రాజెక్టును ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. విద్యార్థులకు రూ.10 వేల ప్రోత్సాహక బహుమతి ప్రకటన.
P.Gannavaram: నరేంద్రపురం గురుకులంలో 'అనంత అరణ్య' ప్రాజెక్ట్ ప్రారంభం
పి. గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, నరేంద్రపురం గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణంలో నెట్ జీరో స్వచ్ఛంద సేవా సంస్థ సౌజన్యంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అనంత అరణ్య" ప్రాజెక్టులో భాగంగా మొక్కల నాటే కార్యక్రమాన్ని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా పాఠశాల ఆవరణంలో 1,600 మొక్కలను నాటడంతో పాటు కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు, తక్కువ నీటితో మొక్కలను సంరక్షించే ప్రత్యేక నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రాంగణాన్ని చిన్న అడవిలా తీర్చిదిద్ది విద్యార్థులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ, డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి రాష్ట్రానికి, దేశానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పదో తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన ప్రతి విద్యార్థికి తన సొంత నిధుల నుంచి రూ.10,000 ప్రోత్సాహక నగదును అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరిన కాంపౌండ్ వాల్, ఇన్వర్టర్, విద్యార్థులకు పరుపులు తదితర అవసరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




