PGannavaram: పి.గన్నవరంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
PGannavaram: డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రూ.78 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.
PGannavaram: పి.గన్నవరంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, నాగుల్లంక గ్రామపంచాయతీ పరిధిలోని మొండెపులంక–వాడ్రేవుపల్లి గ్రామాల మధ్య వశిష్ట ఎడమ ఏటుగట్టుపై రూ.78 లక్షల వ్యయంతో 4.5 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న గ్రావెల్ రోడ్డుకు పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, మొండెపులంక–వాడ్రేవుపల్లి గ్రామాల ప్రజలు ఈ రహదారి నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. నేడు ఈ రహదారికి శంకుస్థాపన చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవలు పొందే ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




