Amalapuram: ఆగస్టు 24న జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ

Amalapuram: డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 24న పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ. క్యూఆర్ కోడ్ ద్వారా పౌరుల అభిప్రాయాల సేకరణ అని కలెక్టర్ వెల్లడి.

PRABHU, RAZOLE
Published on: 23 Aug 2026 4:26 PM IST
Amalapuram
X

Amalapuram: ఆగస్టు 24న జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ

అమలాపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో భాగంగా సోమవారం ఆగస్టు 24న జిల్లావ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు క్యూఆర్ కోడ్

ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో అన్ని పీజీఆర్ఎస్ కేంద్రాల్లో PGRS Citizen Feedback QR Code ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పీజీఆర్ఎస్ ద్వారా సేవలు పొందిన అనంతరం ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు.

సేవల నాణ్యత, సమస్యల పరిష్కార విధానం, అధికారుల స్పందన తదితర అంశాలపై ప్రజలు అందించే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేపడతామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు అనుకూలంగా అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

1100, మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు

ప్రజలు పీజీఆర్ఎస్ కేంద్రాల్లో నేరుగా అర్జీలు సమర్పించడంతో పాటు 1100 టోల్‌ఫ్రీ నంబర్, మీకోసం వెబ్‌సైట్ (meekosam.ap.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా 300కు పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ప్రజలు తమ సమస్యలను సంబంధిత వేదికల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పీజీఆర్ఎస్ ద్వారా సేవలు పొందిన ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని నమోదు చేయాలని కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని నిబంధనల మేరకు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story