Rajahmundry: కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Rajahmundry: రాజమహేంద్రవరం 13వ డివిజన్లో ఇల్లు కూలి సర్వం కోల్పోయిన పతివాడ లలిత కుటుంబానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) భరోసా ఇచ్చారు.
Rajahmundry: కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Rajahmundry: ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యతని మరోసారి నిరూపిస్తూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మానవత్వాన్ని చాటుకున్నారు. "ప్రజల కష్టమే తన కష్టం ఆపదలో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ" అనే నినాదాన్ని ఆయన మరోసారి ఆచరణలో చూపించారు.
స్థానిక 13వ డివిజన్కు చెందిన పతివాడ లలిత కుటుంబం ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనలో తమ నివాస గృహం పూర్తిగా కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఒక్కసారిగా ఇల్లు నేలమట్టం కావడంతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులై, జీవనోపాధికి అవసరమైన అనేక వస్తువులను కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంటనే స్పందించి బాధిత కుటుంబ పరిస్థితిని ఆరా తీశారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున షెడ్డు నిర్మించుకునేందుకు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతని, ప్రకృతి వైపరీత్యాలు లేదా అనుకోని ప్రమాదాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాధ్యమైనంత మేర సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు.
బాధిత కుటుంబం తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న పతివాడ లలిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వాసుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్ట సమయంలో వెంటనే స్పందించి సహాయం అందించడం వల్ల ఎంతో ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, అవసరమైన చోట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సేవలను స్థానికులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, కప్పల వెలుగు కుమారి, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, బొర్రా చిన్ని తదితరులు పాల్గొన్నారు.




