Rajahmundry: ఈనెల 19న ఐఎంఏ ప్రతినిధులతో రాజమండ్రి ఎమ్మెల్యే భేటీ!

Rajahmundry: రాజమండ్రిలో హాస్పిటళ్ల రిజిస్ట్రేషన్లు, పుష్కరాల వైద్య సేవలపై ఐఎంఏ, డీఎంహెచ్‌ఓ అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్షించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 13 Aug 2026 11:19 AM IST
Rajahmundry
X

Rajahmundry: ఈనెల 19న ఐఎంఏ ప్రతినిధులతో రాజమండ్రి ఎమ్మెల్యే భేటీ!

Rajahmundry: హాస్పిటల్స్ యాజమాన్యాలు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.

ఈ అంశాలపై తన కార్యాలయంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) ప్రతినిధులు, డీఎంహెచ్‌ఓ, పలువురు వైద్యులతో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అనవసరమైన సందర్శనలు, ప్రక్రియలో జాప్యం తదితర అంశాలను వైద్యులు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వాసు... వైద్యులకు ఎలాంటి వేధింపులు, అనవసర ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం అయ్యేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువలతమన్నారు. “వైద్యులు తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

అలాగే రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఐ ఎం ఎ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవలు, వైద్య బృందాల ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో వైద్యులను అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు.

పుష్కరాల వైద్య సేవలకు సంబంధించి సుమారు 70–80 మంది ఐ ఎం ఎ వైద్యులు, ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అవసరమైన ప్రాంతాలను గుర్తించి రూట్‌ మ్యాపింగ్‌ చేయాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌, ఎంహెచ్‌ఓ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పుష్కరాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

ఈ మేరకు ఈ నెల 19వ తేదీన ఐ ఎం ఎ ప్రతినిధులు, వైద్యులు, మున్సిపల్‌ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పుష్కరాల వైద్య సేవలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని నిర్ణయించారు.

వైద్యుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, ఐ ఎం ఎ, ప్రభుత్వ శాఖలు, మున్సిపల్‌ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కోరారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story