Rajahmundry: రాజమండ్రి ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పన ఎమ్మెల్యే ఆదిరెడ్డి!

Rajahmundry: రాజమండ్రి 11వ డివిజన్‌లో రూ.15.18 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 29 Aug 2026 11:30 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పన ఎమ్మెల్యే ఆదిరెడ్డి!

Rajahmundry: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, తాగునీటి సౌకర్యాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. 11వ డివిజన్ పరిధిలో రూ.15,18,000 వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం శంఖుస్థాపన చేశారు.

క్రీమ్ స్టోన్ వద్ద ఆర్‌సీసీ కల్వర్టు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు ఆర్‌కే టిఫిన్స్ సెంటర్ వద్ద కల్వర్టు నిర్మాణం, రోడ్డు వెడల్పు పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మౌలిక వసతుల సమస్యలతో ఇబ్బందులు పడిన ప్రాంతాలకు ప్రస్తుతం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారాల దిశగా పనులు చేపడుతున్నామని చెప్పారు.

రహదారుల విస్తరణ, కల్వర్టుల నిర్మాణం ద్వారా ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు వేగం పెరిగిందన్నారు. నగరంలోని ప్రతి డివిజన్ అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘మన వార్డులో – మన ఆదిరెడ్డి’, ‘డోర్ టు డోర్’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు.

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కేవలం హామీలకే పరిమితం చేయకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నగరానికి తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకం కింద భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, వీధి దీపాలు, పారిశుధ్యం, పార్కులు, చెరువుల అభివృద్ధి వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కేవలం మౌలిక వసతులకే పరిమితం కాకుండా విద్య, వైద్యం, క్రీడా రంగాలకు కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. యువత క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

నగరంలో అభివృద్ధి పనులన్నీ సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఒక ప్రాంత అభివృద్ధితో సంతృప్తి చెందకుండా నగరంలోని అన్ని డివిజన్లకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. “నగరాన్ని మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story