Rajahmundry: రాజమండ్రిలో కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన
Rajahmundry: రాజమండ్రి 5వ డివిజన్లో రూ.8.20 లక్షలతో ఆర్సీసీ కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
Rajahmundry: రాజమండ్రిలో కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన
రాజమండ్రి: నగరంలోని 5వ డివిజన్ గుంటూరు మెస్ రోడ్డులో ఎస్కేవీటీ కళాశాల గేటు ఎదురుగా రూ.8.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ కల్వర్టు నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ పనులను మంజూరు చేసి ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరంగా ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్సీసీ కల్వర్టు నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు.
పనులు పూర్తయిన అనంతరం స్థానికులకు సురక్షితమైన రాకపోకలతో పాటు వర్షపు నీటి పారుదల కూడా మెరుగుపడుతుందన్నారు. నగరంలో ప్రతి డివిజన్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నగర అభివృద్ధికి వేగం పెంచుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాలే విజయలక్ష్మి, బర్ల గిరిజ, కడలి రామకృష్ణ, బత్తుల కిరణ్ బాబు, ఆనంద్, సాయి, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




