Rajahmundry: రాజమండ్రి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాలకు పన్ను
Rajahmundry: రాజమహేంద్రవరంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉన్న భవనాలకే పన్ను విధించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.
Rajahmundry: రాజమండ్రి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాలకు పన్ను
రాజమండ్రి: భవనాలకు పన్ను విధించే నాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసి ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. గురువారం ఉదయం అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. టీటీడీ రోడ్డులో పన్ను విధించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న పలు భవనాలను పరిశీలించారు.
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో నిర్మిస్తున్న భవనాలు ఆమోదిత ప్లాన్ ప్రకారం, అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కడితేనే నివాసయోగ్య ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. ప్లాన్లకు, నిర్మాణాలకు తేడాలున్నట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే అర్బన్ లో బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలు జరగాలని.. కనుక నూతనంగా నిర్మాణం చేసే భవనాలు నిబంధనల మేరకు తగిన డ్రైనేజి సిస్టం, గ్రీనరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే నివాసయోగ్య ధృవపత్రం పొందిన తరువాత ఆయా భవనాలకు పన్ను విధించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
నిర్మాణ విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, రెవెన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఆర్ఐ సురేష్, ఇతర సిబ్బంది ఉన్నారు.




