Rajahmundry: రాజమండ్రిలో ఘనంగా ‘క్వాంటమ్ యుఫోరియా’ ఎడ్యుఫేర్

Rajahmundry: రాజమండ్రి ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో అట్టహాసంగా ‘క్వాంటమ్ యుఫోరియా’ ఎడ్యుఫేర్. విద్యార్థుల ఆధునిక సాంకేతిక, శాస్త్రీయ ప్రదర్శనలు విశేష ఆకర్షణ.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 16 Aug 2026 11:04 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో ఘనంగా ‘క్వాంటమ్ యుఫోరియా’ ఎడ్యుఫేర్

రాజమండ్రి: విద్యార్థుల్లో భవిష్యత్ ఆలోచనా విధానం, పరిశోధనా దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో నిర్వహించిన ‘క్వాంటమ్ యుఫోరియా’ ఎడ్యుఫేర్ విశేషంగా ఆకట్టుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, సోషల్ సైన్స్‌తో పాటు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించారు. ముఖ్యంగా 11, 12వ తరగతి విద్యార్థులు క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రొఫెసర్లు విద్యార్థుల పరిజ్ఞానాన్ని అభినందించారు.

చిన్నారుల నుంచి ఉన్నత తరగతుల వరకు విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్, ఏఐ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్టార్టప్ కంపెనీల పనితీరు, వ్యాపార ఆలోచనలు, భవిష్యత్ అవకాశాలను విద్యార్థులు వివరించడం ద్వారా వారిలో పెరుగుతున్న సృజనాత్మకత, వ్యాపార దృక్పథం వెల్లడైంది.

హ్యారీ పాటర్ 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక విజువల్ ప్రదర్శన, ‘అష్టలక్ష్మి వైభవం’, బ్రహ్మోత్సవం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఆధునిక విజ్ఞానంతో పాటు భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఎడ్యుఫేర్‌ను రూపొందించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనా విధానాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే తమ లక్ష్యమని సీఈఓ వై. రుద్రశ్రీ మహారాణి, చైర్మన్ వై. విజయకుమారి, డైరెక్టర్లు ఎం. శేషగిరిధర్, డీన్ ఎం. హర్షిణి, వైస్ ప్రిన్సిపాల్ సైదాభాను, సౌవల్లి పేర్కొన్నారు. ఆధ్వర్యంలో విద్యార్థులను విద్య, విజ్ఞానం, సాంకేతికత, సృజనాత్మకత తదితర రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఎడ్యుఫేర్‌ను వీక్షించేందుకు రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, ప్రజలు తరలిరావడం కార్యక్రమానికి లభించిన ఆదరణకు నిదర్శనమని పాఠశాల ప్రతినిధులు తెలిపారు. ‘క్వాంటమ్ యుఫోరియా’ ద్వారా విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, పరిశోధనా దృక్పథం, భవిష్యత్ సాంకేతికతపై అవగాహన పెంపొందించడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story