Siddipet: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. తడిసి ముద్దవుతున్న రైతు పంట!
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. రగోత్తంపల్లి కేంద్రంలో వానకు తడిసిన ధాన్యం.
Siddipet: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. తడిసి ముద్దవుతున్న రైతు పంట!
దుబ్బాక: ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు కొబ్బరికాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ, రైతు ధాన్యం కొనడంలో లేదని సీపీఎం రాష్ట్ర నాయకురాలు నవీన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతుల దుస్థితిని చూసి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫోటోలకు ఫోజులు తప్ప రైతు బాధలు పట్టవా?’ అంటూ సర్కారు తీరుపై సీపీఎం రాష్ట్ర నాయకురాలు నవీన నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రగోత్తంపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. సెంటర్లో నిలిచిపోయిన ధాన్యాన్ని చూసి ఆమె నివ్వెరపోయారు. నెల రోజుల క్రితం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే, నేటికీ తూకం వేసిన పాపాన పోలేదు. కుప్పలు తిప్పలుగా పోసిన ధాన్యం వాన చినుకులకు తడిసి ముద్దవుతోంది. అకాల వడగళ్ల వానలతో అన్నదాత అల్లాడుతుంటే, అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నవీన దుయ్యబట్టారు.




