Gajwel: సిద్దిపేటలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కలకలం!
Gajwel: సిద్దిపేట రైస్ మిల్లుకు అక్రమంగా తరలిస్తున్న 400 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. ఐషర్ వాహనం, డ్రైవర్ అదుపులోకి.
Gajwel: సిద్దిపేటలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కలకలం!
Gajwel: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని టాస్క్ఫోర్స్ టీమ్ అధికారులు తెల్లవారుజామున పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో మెద్చల్ జిల్లా శామీర్పేట మండల పరిధిలో అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.
TS-05-UC-5599 నంబరు గల ఐచర్ వాహనం శామీర్పేట నుంచి సిద్దిపేట వైపు వెళ్తుండటాన్ని గుర్తించిన అధికారులు వాహనాన్ని వెంబడించారు. వాహనం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామం మీదుగా సిద్దిపేటలోని మహాలక్ష్మి రైస్ మిల్ వద్దకు చేరుకోగానే అధికారులు వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు.
వాహనంలో సుమారు 9 మెట్రిక్ టన్నుల (120 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా రైస్మిల్ పరిసరాల్లో మరో 280 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం సుమారు 400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
వాహనం డ్రైవర్ మాలోత్ శ్రీకాంత్, యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా విచారణలో తేలింది. బియ్యాన్ని మహాలక్ష్మి రైస్మిల్లో అన్లోడ్ చేసేందుకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
పీడీఎస్ బియ్యంతో పాటు ఐచర్ వాహనం, డ్రైవర్ను అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. రైస్మిల్ యజమాని బచ్చు నాగరాజుకు సంబంధించిన వివరాలపై కూడా విచారణ చేపట్టారు.
ఘటనపై పంచనామా నిర్వహించి, సంబంధిత పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీటీసీఎస్ అధికారులకు సమాచారం అందించారు.
ఈ రైడ్ లో హైదరాబాద్ ఎస్పీ ఈటీఎఫ్ రామ్కుమార్ ఆధ్వర్యంలో టీమ్ సభ్యులు ఇన్స్పెక్టర్ జి.అజయ్బాబు, రిటైర్డ్ ఎస్ఐ శ్రీశైలం, పీసీ ప్రభాకర్ పాల్గొన్నారు.




