Gig workers: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య బీమాతో పాటు ఇంకా ఎన్నో
Gig workers: దేశంలో ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఈ-కామర్స్ రంగాల్లో పని చేస్తున్న గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది.
Gig workers: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య బీమాతో పాటు ఇంకా ఎన్నో
Gig workers: దేశంలో ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఈ-కామర్స్ రంగాల్లో పని చేస్తున్న గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా పనిచేసే ఫ్రీలాన్సర్లు సహా లక్షలాది మంది ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
గిగ్ వర్కర్లకు ESIC రక్షణ:
ఇప్పటి వరకు ESIC ప్రయోజనాలు ప్రధానంగా సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లను కూడా ఈ పథకంలో చేర్చాలని ప్రభుత్వం, ESIC కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. దీంతో స్విగ్గీ, జొమాటో, ఉబెర్, ఓలా, ఈ-కామర్స్ డెలివరీ సంస్థల్లో పనిచేసే కార్మికులు కూడా సామాజిక భద్రత పొందే అవకాశం ఉంది.
ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
ఈ పథకం అమల్లోకి వస్తే గిగ్ వర్కర్లకు అనేక రకాల భద్రతా సదుపాయాలు లభించనున్నాయి. ముఖ్యంగా..
ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ఆస్పత్రి చికిత్స సౌకర్యం, ప్రసూతి ప్రయోజనాలతో పాటు ఇతర సామాజిక భద్రతా పథకాల లాభాలు లభిస్తాయి. దీంతో అనారోగ్యం లేదా ప్రమాదం వంటి పరిస్థితుల్లో కార్మికులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది.
ఇ-శ్రం పోర్టల్ ద్వారా నమోదు:
ఈ పథకాన్ని అమలు చేయడానికి గిగ్ వర్కర్ల వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రం పోర్టల్ను ఉపయోగించే అవకాశముంది. అలాగే వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్ కంపెనీల వద్ద ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని కూడా ఉపయోగించి అర్హులైన కార్మికులను గుర్తించనున్నారు. నమోదు పూర్తైన తర్వాత ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా వ్యవస్థ రూపొందిస్తున్నారు.
దేశంలో వేగంగా పెరుగుతున్న గిగ్ ఎకానమీ:
భారత్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, క్యాబ్ సేవలు, ఈ-కామర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ల విస్తరణతో గిగ్ వర్కర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 1 కోటి మంది గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు ఉన్నట్లు అంచనా. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.
అమలుకు ముందు పరిష్కరించాల్సిన అంశాలు:
ఈ పథకం అమలుకు ముందు కొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏయే గిగ్ వర్కర్లను ఈ పథకంలో చేర్చాలి? నిధులను ఎలా సమకూర్చాలి? ఒకటి కంటే ఎక్కువ ప్లాట్ఫామ్లలో పనిచేసే వారికి ప్రయోజనాలు ఎలా అందించాలి? వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సమస్యలకు పరిష్కారం లభించి పథకం అమల్లోకి వస్తే దేశంలోని లక్షలాది మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఇతర గిగ్ వర్కర్లు తొలిసారి సంఘటిత రంగ ఉద్యోగుల తరహాలో సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందగలుగుతారు. దీంతో వారి ఆర్థిక భద్రత బలపడటంతో పాటు దేశంలో గిగ్ ఎకానమీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.




