Viral Video: ఇండిగో ఫ్లైట్లో ‘దేశీ విందు’.. వీడియో వైరల్!
ఇండిగో విమానంలో సమోసాలు, ధోక్లా, థేప్లాలతో కుటుంబం విందు చేసుకున్న వీడియో వైరల్గా మారింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
IndiGo flight viral video
ఇండిగో విమానంలో ఓ కుటుంబం స్నాక్స్తో చిన్నపాటి విందు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమాన ప్రయాణంలో కుటుంబ సభ్యులు కలిసి సమోసాలు, ధోక్లా, థేప్లా, నమ్కీన్ వంటి పలు రకాల ఆహార పదార్థాలను తింటూ కనిపించడం చర్చకు దారితీసింది.
వైరల్ వీడియోలో ఓ మహిళ డిస్పోజబుల్ ప్లేట్లను తీసి కుటుంబ సభ్యులకు ఆహారం వడ్డించడం కనిపించింది. ఒక్కొక్కరికి ప్లేట్లలో స్నాక్స్ వడ్డించుకుని కుటుంబ సభ్యులు కలిసి తిన్నారు. కొంతమంది అమ్మాయిలు అదే సమయంలో ప్రెస్-ఆన్ నెయిల్స్ వేసుకుంటూ కనిపించారు. దీంతో విమానంలోని దృశ్యం కుటుంబ వేడుకను తలపించింది.
విమానంలోనే డిస్పోజబుల్ ప్లేట్లతో విందు
కుటుంబం ముందుగానే పలు రకాల ఆహార పదార్థాలను ప్యాక్ చేసుకున్నట్లు వీడియోలో కనిపించింది. సమోసాలు, ధోక్లా, థేప్లా, నమ్కీన్ తదితర స్నాక్స్ను డిస్పోజబుల్ ప్లేట్లలో వేసుకుని తిన్నారు. భోజనం పూర్తయిన తర్వాత ఉపయోగించిన ప్లేట్లు, ఇతర వ్యర్థాలను కూడా కుటుంబ సభ్యులు ఒక పెద్ద చెత్త బ్యాగ్లో సేకరించారు.
అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు కుటుంబం తమ ఆహారాన్ని తీసుకెళ్లి తినడంలో తప్పేముందని ప్రశ్నించారు. మరికొందరు విమానం వంటి మూసివున్న ప్రదేశంలో ఎక్కువ వాసన వచ్చే ఆహారాన్ని తినడం వల్ల పక్క ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
‘డెసీ స్వాగ్ను ఇలా గ్లోరిఫై చేయొద్దు’ అంటూ కామెంట్లు
ఓ నెటిజన్ విమానాల్లో బయటి ఆహారంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. మరో వ్యక్తి ఇది ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులు లేదా ఏదైనా ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదని, ప్రయాణికుల ప్రవర్తనపైనే దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
మరోవైపు కొందరు మాత్రం కుటుంబానికి మద్దతుగా నిలిచారు. విమానంలో సొంత ఆహారం తీసుకెళ్లడమే తప్పు కాదని, ఎయిర్లైన్స్ అందించే ఆహారానికీ వాసన ఉంటుందని కామెంట్ చేశారు.
అయితే మరికొందరు మధ్యస్థ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ఆహారం రుచికరమే అయినప్పటికీ, విమానం వంటి మూసివున్న ప్రదేశంలో ఆహారం వాసన పక్క ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఈ వైరల్ వీడియో విమాన ప్రయాణంలో సొంత ఆహారం తినడం, పరిశుభ్రత, ఇతర ప్రయాణికుల సౌకర్యం వంటి అంశాలపై కొత్త చర్చకు తెరలేపింది.




