Viral Video : మొబైల్ టార్చ్‌తో ప్రయాణించిన కర్ణాటక బస్సు

Viral Video : టెక్నాలజీ హబ్‌గా, సరికొత్త స్టార్టప్‌లకు నిలయంగా పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రం.. ఇప్పుడు రవాణా రంగంలోనూ సరికొత్త ‘కాస్ట్ కటింగ్’ ఆవిష్కరణకు తెరలేపింది.

G Krishna
Published on: 6 July 2026 4:06 PM IST
mobile torch
X

 mobile torch

Viral Video : టెక్నాలజీ హబ్‌గా, సరికొత్త స్టార్టప్‌లకు నిలయంగా పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రం.. ఇప్పుడు రవాణా రంగంలోనూ సరికొత్త ‘కాస్ట్ కటింగ్’ ఆవిష్కరణకు తెరలేపింది. రాత్రి వేళ ఘోరమైన చీకటి రోడ్డుపై ఒక ప్రభుత్వ బస్సు వెళ్తోంది. అయితే ఆ బస్సుకు హెడ్‌లైట్లు పనిచేయడం లేదు. సాధారణంగా అయితే మెకానిక్‌ను పిలిపించడమో, లేదా బస్సును పక్కన ఆపేయడమో చేస్తారు. కానీ, మన కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KKRTC) సిబ్బంది అంతటి పిరికివాళ్లు కాదు.. "కొత్త హెడ్‌లైట్ బల్బులు కొనడానికి బడ్జెట్ లేదు సార్" అని అనుకున్నారో ఏమో.. వెంటనే కండక్టర్ రంగంలోకి దిగారు. తన జేబులోంచి స్మార్ట్‌ఫోన్ తీసి, టార్చ్‌లైట్ ఆన్ చేసి, కిటికీలోంచి రోడ్డుపైకి ఫోకస్ పెట్టారు. డ్రైవర్ ఆ మొబైల్ వెలుతురును నమ్ముకుని స్టీరింగ్ తిప్పుతూ బస్సును ముందుకు పోనిచ్చారు. ఈ ‘సాహసోపేత’ దృశ్యాలను ఎవరో మొబైల్‌లో రికార్డ్ చేయడంతో, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

జేడీఎస్ (JDS) రాష్ట్ర యువజన అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురిపించారు. "అబ్బా.. ఎంతటి అద్భుతమైన పరిపాలన.. రవాణా శాఖను ఎంతలా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.." అంటూ విపక్షాలు చెలరేగిపోతున్నాయి. నెటిజన్లు సైతం "ఇది కదా అసలైన డిజిటల్ ఇండియా అంటే.. బస్సు హెడ్‌లైట్లకు కూడా మొబైల్ చార్జింగే దిక్కు" అంటూ జోకులు పేలుస్తున్నారు.

'శక్తి' పథకం సూపర్.. కానీ బస్సులకు ముసుగు వీడని దరిద్రం

కర్ణాటకలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘శక్తి’ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. పథకం ప్రచారం అయితే దేశవ్యాప్తంగా సాగింది కానీ, దాని వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడింది. ఈ ఉచిత ప్రయాణాల వల్ల రవాణా సంస్థలకు ప్రభుత్వం రీఇంబర్స్ చేయాల్సిన బకాయిలు అక్షరాలా రూ. 4,573 కోట్లకు చేరాయి. ప్రభుత్వం ఆ పైసలన్నీ నొక్కిపెట్టడంతో.. రవాణా సంస్థల దగ్గర బస్సులకు కనీసం ఆయిల్ మార్పించడానికి, అరిగిపోయిన టైర్లు మార్చడానికి, ఆఖరికి పోయిన హెడ్‌లైట్ బల్బులు కొనడానికి కూడా పైసలు లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా, సంస్థలను ఇలా కండక్టర్ల మొబైల్ డేటా, చార్జింగ్‌లపై ఆధారపడేలా చేశారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. "మహిళలకు ఫ్రీ జర్నీ అయితే ఇచ్చారు కానీ, ఆ జర్నీ చీకట్లో మొబైల్ టార్చ్ వెలుగులో చేయాల్సి వస్తుందని ముందే చెప్పాల్సింది" అంటూ ప్రయాణికులు చమత్కరిస్తున్నారు.

కేంద్రం ఫ్రీగా 4,500 ఈ-బస్సులు ఇస్తామన్నా.. మాకొద్దు బాబోయ్

ఈ మొబైల్ టార్చ్ కథ ఇంతటితో ఆగలేదు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి 'పీఎం ఈ-డ్రైవ్' (PM E-DRIVE) పథకం కింద బెంగళూరు రవాణా సంస్థ (BMTC)కు ఏకంగా 4,500 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. గతేడాది డిసెంబర్ 2025లోనే దీనికి సంబంధించిన అధికారిక కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. కేంద్రమే ఉచితంగా ఇన్ని పర్యావరణ అనుకూల బస్సులను ఇస్తుంటే ఏ ప్రభుత్వమైనా ఎగిరిగంతేసి ఆ ఫైల్‌పై సంతకం పెడుతుంది. కానీ, మన కర్ణాటక స్మార్ట్ సర్కారు మాత్రం ఇప్పటివరకు దానికి సంబంధించిన 'లెటర్ ఆఫ్ అవార్డ్' (LoA) ఇవ్వకుండా ఆ ఫైళ్లను అటకెక్కించింది. బహుశా కేంద్రం ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆటోమేటిక్ సెన్సార్లు, పవర్‌ఫుల్ లైట్లు ఉంటాయని, వాటిలో ఇలా కండక్టర్ టార్చ్‌లైట్ పెట్టి నడిపించే ‘క్రియేటివిటీ’కి అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి ఉంటారని రాజకీయ వర్గాలు కౌంటర్లు వేస్తున్నాయి.

‘నెక్స్ట్ లెవెల్’ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి

ప్రస్తుతం ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, ఎప్పుడు ఏ గుంతలో బస్సు పడుతుందో తెలియక మొబైల్ టార్చ్ వెలుగుల్లో ప్రయాణిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం తాము రాష్ట్రంలో రవాణా విప్లవాన్ని తీసుకొచ్చామని ప్రకటనలు ఇచ్చుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి.. "ఈ రోజు హెడ్‌లైట్ పోతే మొబైల్ టార్చ్ వాడారు.. రేపు పొద్దున బస్సు బ్రేకులు ఫెయిల్ అయితే, కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ కాళ్లు కిందపెట్టి రోడ్డుకు రుద్ది బస్సును ఆపుతారేమో.." అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా, కర్ణాటక రవాణా శాఖ మార్క్ ‘హైటెక్’ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా నవ్వులపాలు చేస్తోంది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story