Anand Mahindra : ఆనంద్ మహీంద్రాను కదిలించిన 'అమ్మ' త్యాగం..!

Anand Mahindra : మే 10, 2026న ప్రపంచమంతా మదర్స్ డే వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. కొత్తగా తల్లైన వారు, అత్తమ్మలు, అమ్మమ్మలు..

G Krishna
Published on: 13 May 2026 1:08 PM IST
Anand-Mahindra
X

Anand-Mahindra

Anand Mahindra : మే 10, 2026న ప్రపంచమంతా మదర్స్ డే వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. కొత్తగా తల్లైన వారు, అత్తమ్మలు, అమ్మమ్మలు.. ఇలా ప్రతి మాతృమూర్తి తమ పిల్లల కోసం, కుటుంబం కోసం చేస్తున్న కృషిని అందరూ స్మరించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ (X) లో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఒక సామాన్య మహిళ కూరగాయలు అమ్ముకుంటూ తన కొడుకును ఎలా ప్రయోజకుడిని చేసిందో చూపిస్తూ, ప్రతి తల్లి త్యాగానికి సెల్యూట్ చేస్తూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.

ఫుట్‌పాత్‌పైనే పండగ..

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గోపాల్ సావంత్ అనే యువకుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కి ఎంపికయ్యాడు. ఆ గుడ్ న్యూస్ విన్న వెంటనే అతను యూనిఫాంలో తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె అప్పటికే కుడాల్ ప్రాంతంలోని ఒక దుమ్ముతో కూడిన ఫుట్‌పాత్‌పై కూర్చొని కూరగాయలు అమ్ముతోంది. కొడుకును ఆఫీసర్ డ్రెస్ లో చూడగానే ఆ తల్లి కళ్ళలో నీళ్లు తిరిగాయి. గోపాల్ వెంటనే తన తల్లి పాదాలకు నమస్కారం చేసి, ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన వారు ఎవరైనా సరే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు.

ఎండనక వాననక.. ఒక్కో రూపాయి కూడబెట్టి

గోపాల్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక అతని తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తన కొడుకు చదువు ఆగిపోకూడదని ఆమె ఏళ్ల తరబడి మండుతున్న ఎండలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతూ ఒక్కో రూపాయి సంపాదించింది. కొడుకును విద్యావంతుడిని చేయడానికి ఆమె తన జీవితాన్నే త్యాగం చేసింది. తన తల్లి పడ్డ కష్టానికి ఫలితంగానే గోపాల్ ఇవాళ సీఆర్పీఎఫ్ లోకి ఇండక్ట్ అయ్యాడు. అందుకే ఆ సక్సెస్ సాధించిన వెంటనే తను వెళ్ళింది ఏ లగ్జరీ హోటల్ కో కాదు, తన తల్లి కష్టపడుతున్న ఆ ఫుట్‌పాత్ దగ్గరికే.

మహీంద్రా మెచ్చిన మాతృప్రేమ

ఈ హృదయ విదారక దృశ్యాన్ని షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఎంతో గొప్పగా స్పందించారు. ప్రతి గొప్ప విజయం వెనుక ఒక తల్లి త్యాగం ఖచ్చితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడే ప్రతి తల్లికి ఈ రోజు అంకితం అని, వారే నిజమైన హీరోలని కొనియాడారు. "గోపాల్ సావంత్ తల్లి తన కొడుకు చదువు కోసం ఎండలో కష్టపడింది. ఇవాళ కొడుకు సాధించిన ఈ విజయం ఆమెకు లభించిన అతిపెద్ద గిఫ్ట్" అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

సోషల్ మీడియాలో సెల్యూట్ల వర్షం

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "తల్లి త్యాగానికి ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు.. ఆమె ఒక తల్లి మాత్రమే కాదు, మన జీవితంలో బిగ్గెస్ట్ సపోర్టర్" అని ఒకరు కామెంట్ చేయగా, "మనం ఎంత ధనవంతులమైనా సరే మన అమ్మ పడ్డ కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు" అని మరొకరు రాసుకొచ్చారు. ఒక కొడుకు లేదా కూతురు తమ తల్లిదండ్రులకు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఇదేనని, వారు కోరుకునే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇదేనని అందరూ గోపాల్‌ను , అతని తల్లిని అభినందిస్తున్నారు. ఈ ఘటన సమాజంలో అమ్మ పాత్ర ఎంత గొప్పదో మరోసారి చాటి చెప్పింది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story