Viral Video: బ్యాంక్ డబ్బుల కోసం అక్క శవాన్ని తవ్వి బ్యాంక్కి తీసుకెళ్లిన అన్న.!
ఒడిశాలో ఓ వ్యక్తి అక్క డబ్బుల కోసం సమాధి తవ్వి ఎముకలతో బ్యాంక్ ఎదుట నిరసన చేశాడు. అవగాహన లేక ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.
Odisha Man Digs Sister Skeleton for Rs 19K Bank Claim
Viral Video: ఒడిశాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అక్క ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన పని అందరినీ షాక్కు గురి చేసింది. డబ్బుల కోసం అక్క సమాధిని తవ్వి, ఎముకలను సంచిలో వేసుకుని బ్యాంక్ ఎదుట నిరసన చేపట్టాడు.
ఈ ఘటన కేయోంజర్ జిల్లాలోని మల్లిపాసి గ్రామంలో చోటుచేసుకుంది. జితు ముండా అనే గిరిజన వ్యక్తి తన అక్క మరణించిన తర్వాత ఆమె ఖాతాలో ఉన్న సుమారు రూ.19,300 తీసుకోవడానికి స్థానిక గ్రామీణ బ్యాంక్కి వెళ్లాడు. అయితే ఖాతా ఆమె పేరులో ఉండటంతో, అవసరమైన పత్రాలు తీసుకురావాలని బ్యాంక్ సిబ్బంది తెలిపారు.
అక్క మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పినా, చదువు తెలియని జితు ముండా దాని అర్థం చేసుకోలేకపోయాడు. దీంతో అతను సమాధిని తవ్వి, ఎముకలను సాక్ష్యంగా తీసుకుని బ్యాంక్కి వచ్చి నిరసన తెలిపాడు.
ఎముకలను చూసి భయపడిన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జితు ముండాను సమాధానపరిచి, డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలని సూచించారు. అనంతరం అతను ఎముకలను తిరిగి సమాధిలో పెట్టాడు.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, "అతను అమాయకుడు. బ్యాంక్ నిబంధనలు, అవసరమైన పత్రాల గురించి అవగాహన లేక ఇలా చేశాడు" అని తెలిపారు.
ఈ సంఘటన గ్రామంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.




