Rajasthan Elections: ఒక్క ఓటే వచ్చింది.. కానీ అసలు కారణం తెలిస్తే షాక్.!
Rajasthan Elections: రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని ఫలితం ఒకటి వెలుగులోకి వచ్చింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ఓ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు
Rajasthan Elections
Rajasthan Elections: రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని ఫలితం ఒకటి వెలుగులోకి వచ్చింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ఓ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. దీంతో ఈ ఫలితం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఆ అభ్యర్థికి ఒక్క ఓటు రావడం వెనుక కారణం తెలుసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది.
13వ వార్డులో పోటీ
దిడ్వానా-కుచమన్ జిల్లాలోని పర్బత్సర్ మున్సిపాలిటీలోని 13వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా కైలాశ్చంద్ బరిలో నిలిచారు. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయనకు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బీజేపీ అభ్యర్థికి ఇంత తక్కువ ఓట్లు రావడంపై చర్చ మొదలైంది. అయితే ఇదే వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి హీనా ఖానమ్ 376 ఓట్లు సాధించి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి రషీద్ ఖాన్ 195 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరితో పోలిస్తే కైలాశ్చంద్కు వచ్చిన ఓట్ల సంఖ్య ఒక్కటే కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
తన ఓటు కూడా వేసుకోలేకపోయారు
తనకు ఒక్క ఓటు మాత్రమే రావడంపై కైలాశ్చంద్ స్వయంగా ఆసక్తికర వివరణ ఇచ్చారు. తన ఓటు తాను పోటీ చేసిన వార్డులో లేదని చెప్పారు. వాస్తవానికి తన ఓటు 13వ వార్డుకు పక్కనే ఉన్న 12వ వార్డులో ఉందని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు 13వ వార్డు నుంచి పోటీ చేశానని, దీంతో తాను పోటీ చేసిన వార్డులో తన ఓటును తానే వేసుకునే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. తనకు వచ్చిన ఆ ఒక్క ఓటు మాత్రం 13వ వార్డుకు చెందిన వ్యక్తి వేసినదేనని కైలాశ్చంద్ తెలిపారు.
ఫలితం వెనుక ఇదే కారణం
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనకు తానే ఓటు వేసుకుంటాడని భావిస్తాం. కానీ కైలాశ్చంద్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన ఓటు హక్కు 12వ వార్డులో ఉండగా.. పార్టీ టికెట్ మాత్రం 13వ వార్డుకు దక్కింది. దీంతో తనకు తాను ఓటు వేసుకునే అవకాశం లేకపోయింది. ఫలితంగా 13వ వార్డులో ఆయనకు మద్దతుగా ఒక్క ఓటు మాత్రమే పడింది. ఈ వివరాలు బయటకు రావడంతో మొదట కనిపించిన ‘ఒక్క ఓటు’ కథ వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని స్పష్టమైంది.
పర్బత్సర్లో కాంగ్రెస్ ఆధిక్యం
మొత్తం 25 వార్డులు ఉన్న పర్బత్సర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంతో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 13 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ 12 వార్డుల్లో విజయం సాధించింది. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. ఇక రాజస్థాన్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 309 పట్టణ స్థానిక సంస్థల్లో 10 వేలకు పైగా కౌన్సిలర్ పదవులకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పర్బత్సర్ 13వ వార్డులో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఒక్క ఓటు మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.




