Viral Video : మహాకాళేశ్వర్ ఆలయంలో వింత టెస్ట్.. వీడియో వైరల్..!

Viral Video : మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో నాగ్ పంచమి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఒక భద్రతా పరీక్ష

G Krishna
Published on: 18 Aug 2026 2:56 PM IST
Viral-Video
X

Viral-Video

Viral Video : మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో నాగ్ పంచమి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఒక భద్రతా పరీక్ష ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలయంలోని అత్యంత కీలకమైన ఐరన్ ఓవర్‌బ్రిడ్జి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సుమారు 300 మంది సెక్యూరిటీ గార్డ్స్‌తో అధికారుల సమక్షంలో "జంప్ టెస్ట్" నిర్వహించడం విమర్శలకు దారితీసింది.

బరువును తట్టుకుంటుందా? 15 నిమిషాల పాటు దూకిన గార్డ్స్

మహకాళేశ్వర ఆలయ కాంప్లెక్స్‌లోని నాగ్చంద్రేశ్వర్ ఆలయానికి వెళ్లేందుకు 91 అడుగుల పొడవైన ఇనుప ఓవర్‌బ్రిడ్జిని ఉపయోగిస్తారు. నాగ్ పంచమి రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తారు. ఈ భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వంతెన భద్రతను తనిఖీ చేసేందుకు వార్షిక తనిఖీల్లో భాగంగా ఆలయ కమిటీ ఈ వింత పరీక్షను చేపట్టింది. సుమారు 300 మంది భద్రతా సిబ్బందిని వంతెనపైకి పంపి, వారందరినీ ఒకేసారి 10 నుంచి 15 నిమిషాల పాటు పైకి క్రిందకు దూకాలని ఆదేశించారు. పండుగ సమయంలో భక్తుల రద్దీ వల్ల వచ్చే ఒత్తిడిని ఈ వంతెన తట్టుకోగలదా లేదా అని తెలుసుకోవడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం.

ప్రతి ఏటా ఇదే తంతు.. వీడియో వైరల్ కావడంతో విమర్శలు

ఆలయ కమిటీ ఇలాంటి పరీక్షను నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా నాగ్ పంచమికి ముందు ఈ జంప్ టెస్ట్ నిర్వహించి, వంతెన సురక్షితంగా ఉందంటూ భక్తులకు భరోసా ఇచ్చేందుకు ఆ ఫోటోలు, వీడియోలను అడ్మినిస్ట్రేషన్ విడుదల చేస్తూ వస్తోంది. అయితే, ఈసారి దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అత్యాధునిక ఇంజనీరింగ్ ల్యాబ్‌లు, ఆధునిక స్ట్రక్చరల్ టెస్టింగ్ పరికరాలు అందుబాటులో ఉన్న ఈ డిజిటల్ యుగంలో, వంతెన దృఢత్వాన్ని పరీక్షించడానికి మనుషులతో ఇలా దూకించడం అమానుషమని, ప్రమాదకరమని నెటిజన్లు మండిపడుతున్నారు.

25 ఏళ్ల నాటి వంతెన చరిత్ర

నాగ్చంద్రేశ్వర్ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడాది పెరుగుతుండటంతో, వారి రాకపోకలను సులభతరం చేసేందుకు దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని నిర్మించారు. అంతకుముందు భక్తులు ప్రధాన ఆలయం లోపలి మార్గం ద్వారానే దర్శనానికి వెళ్లేవారు. అయితే, పాతికేళ్ల నాటి ఈ ఇనుప నిర్మాణంపై సరైన సైంటిఫిక్ టెస్టులు చేయకుండా ఇలా వందలాది మందితో ఒత్తిడి తీసుకురావడం సురక్షితం కాదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story