Viral News: రూ.66 లక్షల ఉద్యోగానికి గుడ్బై.. ప్రశాంత జీవితం కోసం రిసెప్షనిస్ట్గా మారిన మహిళ
ఏడాదికి రూ.66 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి 40% జీతం తగ్గినా ప్రశాంత జీవితం కోసం రిసెప్షనిస్ట్గా మారిన మహిళ కథ వైరల్గా మారింది.
Woman Quits Job
ఏడాదికి సుమారు రూ.66 లక్షల జీతం వచ్చే ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలేసి, 40 శాతం తక్కువ వేతనంతో రిసెప్షనిస్ట్గా చేరిన ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల గ్రేస్ మెక్క్లెలాండ్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డబ్బు కంటే మానసిక ప్రశాంతత, ఆరోగ్యమే ముఖ్యమని భావించి ఆమె తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేస్తోంది.
గ్రేస్ తన కెరీర్ను రిటైల్ కంపెనీలో సేల్స్ అసోసియేట్గా ప్రారంభించి, క్రమంగా స్టోర్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. అయితే బాధ్యతలు పెరిగేకొద్దీ పని ఒత్తిడి, ఎక్కువ ప్రయాణం, ఆందోళన, బర్నౌట్ కారణంగా వ్యక్తిగత జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఉద్యోగం ముగిసే సరికి తనకు ఇతర పనుల కోసం శక్తి కూడా మిగలడం లేదని ఆమె వెల్లడించారు.
ఈ పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసిన గ్రేస్, మరో కార్యాలయ ఉద్యోగంలో చేరినా ఎక్కువకాలం కొనసాగలేదు. అనంతరం లగ్జరీ రిటైల్ కంపెనీ నుంచి బోనస్లు, విదేశీ పర్యటనలతో కూడిన సంవత్సరానికి సుమారు రూ.66 లక్షల వేతన ప్యాకేజీ రావడంతో మరోసారి మేనేజ్మెంట్ ఉద్యోగాన్ని అంగీకరించారు.
అయితే అధిక వేతనం వచ్చినప్పటికీ పనిపై ఆసక్తి తగ్గిపోవడం, ప్రతిరోజూ ఒత్తిడితోనే జీవించడం తనకు ఇష్టంలేదని గ్రేస్ గుర్తించారు. దీంతో మరోసారి ఉద్యోగానికి రాజీనామా చేసి, కొంతకాలం విరామం తీసుకున్న తర్వాత జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు.
2024 జూలైలో రిసెప్షనిస్ట్, ఆఫీస్ మేనేజర్గా కొత్త ఉద్యోగంలో చేరిన ఆమెకు గతంతో పోలిస్తే 40 శాతం తక్కువ జీతం వస్తోంది. అయినప్పటికీ ఇప్పుడు తనకు సమయం, మానసిక ప్రశాంతత, కుటుంబంతో గడిపే అవకాశం లభించిందని, అదే నిజమైన విజయమని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉద్యోగంతో పాటు క్రోషే వంటి హాబీలను ఆస్వాదిస్తూ, సోషల్ మీడియా కంటెంట్ సృష్టించడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. తనను రిసెప్షనిస్ట్గా చెప్పుకోవడంలో ఎలాంటి సంకోచం లేదని, చాలామంది ప్రశాంతమైన ఉద్యోగం కోసం తనను చూసి ఆశ్చర్యపడుతున్నారని గ్రేస్ పేర్కొన్నారు.




