Air Craft: 27 నిమిషాల ప్రయాణం.. రూ.420 ఖర్చు.. అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం ఇదిగో!
Air Craft: ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ విజయవంతంగా తన తొలి విమానయానం పూర్తి చేసింది. కేవలం రూ.500 విలువైన విద్యుత్ను మాత్రమే వినియోగించుకుంది.
Air Craft: 27 నిమిషాల ప్రయాణం.. రూ.420 ఖర్చు.. అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం ఇదిగో!
Air Craft: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ విమానయాన రంగంలో ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. హార్ట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్స్-వన్ తన తొలి విమానయానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. న్యూయార్క్లోని ప్రాంతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం సుమారు ఇరవై ఏడు నిమిషాల పాటు గాలిలో విజయవంతంగా ప్రయాణించింది. ఈ మొత్తం ప్రయాణంలో కేవలం ఆన్-బోర్డ్ బ్యాటరీ సిస్టమ్స్ను మాత్రమే ఉపయోగించడం విశేషం.
ఈ టెస్ట్ ఫ్లైట్ సమయంలో కేవలం ఐదు డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.420 విలువైన విద్యుత్ మాత్రమే ఖర్చయింది.
ఎయిర్క్రాఫ్ట్ సుమారు ఒక మెగావాట్ కంటే ఎక్కువ శక్తిని వినియోగించుకుంది. ఇరవై ఐదు వేల పౌండ్లకంటే ఎక్కువ బరువు ఉన్న ఈ భారీ విమానం కమర్షియల్ ఎయిర్లైన్స్ స్థాయిలో ఎలక్ట్రిక్ విమానయానం సాధ్యమేనని నిరూపించింది. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో విమాన ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే కేవలం విద్యుత్ ఖర్చు తక్కువగా ఉన్నంత మాత్రాన భవిష్యత్తులో టికెట్లు అన్నీ అదే ధరకు లభిస్తాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విమాన నిర్వహణ ఖర్చులు, పైలట్ల వేతనాలు, ఇన్సూరెన్స్, ఇతర చార్జీలు అన్నీ కలిపినప్పుడు ప్రయాణ ఖర్చు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ సంప్రదాయ విమానాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ విమానాల ద్వారా నిర్వహణ వ్యయం దాదాపు కొంత శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఎయిర్లైన్ రంగంలో ఆర్థిక సమీకరణాలు పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉందని సంస్థ సీఈఓ అండర్స్ ఫోర్స్లుండ్ తెలిపారు.
ఈ ఎక్స్-వన్ ఎయిర్క్రాఫ్ట్ నేరుగా ప్రయాణికుల సేవల్లోకి రానప్పటికీ, త్వరలో రానున్న ఈఎస్-30 ప్రొడక్షన్ ఎయిర్క్రాఫ్ట్ కోసం టెక్నాలజీని పరీక్షించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ముప్పై సీట్ల సామర్థ్యం కలిగిన ఈ హైబ్రిడ్-ఎలక్ట్రిక్ ప్రాంతీయ విమానం రెండు వేల ముప్పై ఒకటి నాటికి సర్వీసులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎయిర్ కెనడా వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపించాయి. భవిష్యత్తులో మరింత స్వచ్ఛమైన, తక్కువ ఖర్చుతో కూడిన విమాన ప్రయాణాలను అందించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.




