Arunachala Girivalam: అరుణాచలం ప్రదక్షిణలో కాలికి దెబ్బతగిలిందా... స్వయంగా ఆ అమ్మవారే ఇలా చేస్తారట...అక్షర సత్యం
అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గిరి ప్రదక్షిణను రోజూ వేలాది మంది చేస్తున్నారు. మార్గమధ్యలో ఎవరికైనా కాలికి దెబ్బతగిలితే స్వయంగా ఆలయంలో కొలువైన ఆ అపితకుచమాంబే ఇలా చేస్తారని మీకు తెలుసా?
Arunachala Girivalam: ఇటీవల కాలంలో అరుణాచలంలో ప్రదక్షిణ చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. తమిళనాడు నుంచే కాకుండా కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గతంలో పౌర్ణమి రోజుల్లో మాత్రమే రద్దీ ఉండేది. కానీ, ఇప్పుడు వారాంతాలు, సాధారణ రోజుల్లోనూ రద్దీ భారీగా ఉండటం విశేషం. అయితే, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనే దానిపై రమణులు ఓ గొప్ప విషయాన్ని భక్తులకు బోధించారు. నిండు గర్భిణి ఏవిధంగా నిదానంగా నడుస్తుందో..ఆవిధంగా నడవాలని సూచించారు. ఇక స్వామివారి నామస్మరణ చేస్తూ... గిరి ప్రదక్షిణ చేస్తుండగా...కాలికి అనుకోని విధంగా దెబ్బతగిలి రక్తం వస్తుంటే... ఏం జరుగుతుందో తెలుసా?
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ
అరుణాచలం వెళ్లగానే భక్తులు మొదటగా చేసేపని...స్నానం చేసి గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. అయితే, గిరి ప్రదక్షిణకు వెళ్లేముందు ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీమహావిష్ణువును, ఆ తరువాత ద్విముఖ గణపతిని దర్శించుకోవాలి. ఆ తరువాతే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలని అంటారు. తాము గిరి ప్రదక్షిణకు వెళ్తున్నామని శ్రీమహావిష్ణువుకు, ఆ తరువాత తమ ప్రదక్షిణ నిర్విఘ్నంగా పూర్తికావాలని ద్విముఖ గణపతికి చెప్పాలి. వారి వద్ద అనుమతి తీసుకున్న తరువాతే గిరి ప్రదక్షిణ చేయాలని పండితులు చెబుతున్నారు. గిరి వలయంలో ఉండే ప్రతి చిన్నా పెద్దా ఆలయాలను దర్శించుకుంటూ ముందుకు సాగాలి. హడావుడిగా, పరుగులు తీసినట్టుగా కాకుండా నిదానంగా, నిండు గర్భిణి నడిచిన విధంగా ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షి భక్తులకు సెలవిచ్చారు. రమణులు గిరి ప్రదక్షిణ కనీసం రెండు మూడు రోజులపాటు కొనసాగేదని అంటారు. జీవులకు ఆహారం సమర్పిస్తూ ముందుకు సాగుతారు.
ప్రదక్షిణలో దెబ్బ తగిలితే
స్వామివారిని మనసులో తలచుకుంటూ...గిరి వలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అనుకోని విధంగా ఎవరి కాలికైనా దెబ్బ తగిలితే...సాధారణంగా ఎవరూ ఆ కాలికి కట్టు కట్టేందుకు అర్హత ఉండదు. కాలికి దెబ్బ తగిలి రక్తం కారితే...సాక్షాత్తు అపిత కుచమాంబ రూపంలో ఆలయంలో కొలువైన పార్వతీదేవి సాధారణ మహిళ రూపంలో వచ్చి దెబ్బ తగిలిన కాలికి కట్టుకడుతుంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఇలా అక్షర సత్యమని, పలు సందర్భాల్లో పలువురికి ఇలానే జరిగిందని తెలిపారు. అయితే, ఎంత హడావుడిగా నడిచినా... ఎంత వేగంగా పరుగులు తీసినా... ఎన్నివేల మంది ఒకేసారి గిరి ప్రదక్షిణ చేసినా ఎవరికీ దెబ్బ తగలడం అంటూ జరగదు. ఇలా ఎవరికైనా జరిగింది అంటే వారు అదృష్టవంతులే.




